ప్రేక్షకులను దేవుళ్లుగా అభివర్ణిస్తారు. అభిమానులు లేకపోతే తాము లేమంటారు. కానీ ఆ ప్రేక్షకులు, అభిమానుల కోసం సినీ జనాలు ఏం చేస్తారు అంటే.. జవాబు కనిపించదు. మాటలతో వాళ్లను కొనియాడడమే తప్ప, సామాన్య ప్రేక్షకులు, అభిమానుల కోసం చేయి అందించేవాళ్లు అరుదు. ఐతే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఒక గొప్ప సాయం అందబోతోంది.
ఎన్నో ఏళ్ల నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానులుగా ఉంటూ.. ఆయన పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్న అభిమానులకు రూ.5 లక్షల మేర ఆరో బీమా చేయించబోతున్నారు. ఈ బాధ్యతను అఖిల భార చిరంజీవి యువత చేపట్టబోతోంది. దీనికి మెగాస్టార్ కూడా చేయూత అందించబోతున్నట్లు తెలుస్తోంది.
చిరుతో సన్నిహితంగా మెలిగే అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు.. మెగాస్టార్ అభిమానులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించాడు. ఈ నెల 22న చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈసారి చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 15 నుంచి వారం పాటు ఉత్సవాలు చేయబోతున్నారు.
ఇందులో భాగంగా గత 30 ఏళ్లుగా మెగాస్టార్ చిరంజీవి మీద అమితమైన అభిమానం చూపిస్తూ, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్న సీనియర్ అభిమానులను గుర్తించి, వారికి ఈ వారోత్సవాల్లో 5 లక్షల ఇన్సూరెన్స్ అందించబోతున్నారు. ముందుగా గుంటూరు జిల్లాలో వచ్చే నెల ఈ ఇన్సూరెన్స్ పాలసీని అందించే కార్యక్రమం మొదలవుతుందని రవణం స్వామి నాయుడు ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates