రాఖీ భాయ్ జోడిగా గేమ్ ఛేంజర్ భామ ?

కెజిఎఫ్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న యష్ కొత్త సినిమా టాక్సిక్ వచ్చే ఏడాది విడుదలని టార్గెట్ గా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంకా పూర్తి స్థాయిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. హీరోయిన్ ఎంపిక పెండింగ్ ఉంది. ఆ మధ్య కరీనా కపూర్ ని తీసుకున్నారనే వార్త చక్కర్లు కొట్టింది కానీ నాలుగు పదుల వయసు దాటిన బాలీవుడ్ భామ యష్ కు సెట్ అవుతుందో లేదోననే అనుమానాలు ఫ్యాన్స్ లో తలెత్తాయి. అయితే ఇది పుకార్ల స్టేజి వద్దే ఆగిపోయింది. అలాంటిదేమి లేదని కరీనా తరఫున ఆమె బృందం క్లారిటీ ఇవ్వడంతో డౌట్ తీరిపోయింది.

తాజాగా కియారా అద్వానీని సంప్రదించినట్టు తెలిసింది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చివరి దశ చిత్రీకరణ కోసం తెలుగు రాష్ట్రాల్లోనే తిరుగుతున్న ఈ బ్యూటీని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఒక ఆప్షన్ గా పెట్టుకున్నట్టు సమాచారం. కాకపోతే డేట్లు తీసుకోవడం అసలు సమస్య. ప్రస్తుతం కియారా హిందీలో డాన్ 3 కి కమిట్ మెంట్ ఇచ్చింది. రణ్వీర్ సింగ్ హీరో. జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2కి ఎస్ చెప్పింది. ఒకవేళ టాక్సిక్ ఒప్పుకోవాలంటే కాల్ షీట్లు సరిచూసుకోవాలి. గీతూ అయితే బల్క్ గానే అడిగారని వినికిడి. సో క్లారిటీకి ఇంకొంత వెయిట్ చేయాలి.

ఒకవేళ తనతో కుదరకపోతే సలార్ నుంచి మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన శృతి హాసన్ పేరు కూడా పరిశీలనలో ఉందట. కన్ఫర్మ్ గా టీమ్ నుంచి ఎలాంటి ధృవీకరణ లేదు. టాక్సిక్ నేపధ్యం గోవా మాఫియా ఆధారంగా ఉంటుంది. భారీ ఎత్తున యాక్షన్ ఎపిసోడ్లను ప్లాన్ చేసుకున్నారు. ఇంటెలిజెంట్ అండ్ సెన్సిబుల్ ఫిలిం మేకర్ గా పేరున్న గీతూ మోహన్ దాస్ ఇంత పెద్ద కమర్షియల్ యాక్షన్ కాన్వాస్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందనే అనుమానాలు ఇండస్ట్రీలో లేకపోలేదు. కానీ యష్ మాత్రం ఆవిడ స్క్రిప్ట్ రాసుకున్న విధానం, నెరేషన్ కు ముగ్దుడై బాగా టైం తీసుకుని ఓకే చేశాడట.