చిరంజీవి సినిమాలో సాయి పల్లవి?

వేదళాం చిత్రాన్ని రీమేక్‍ చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని రీమేక్‍ చేసే బాధ్యతను మెహర్‍ రమేష్‍కు అప్పగించారనేది కూడా తెలిసిన సంగతే. చిరంజీవి ఇంకా అధికారికంగా ఆ విషయం ప్రకటించకపోయినా, చిరంజీవితో మెహర్‍ సినిమా వుంటుందని పవన్‍ కళ్యాణ్‍ ఖరారు చేసేసాడు. అయితే ఈ రీమేక్‍ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంకా స్పష్టమయిన సమాచారం లేదు. ముందుగా ఆచార్య షూటింగ్‍ పూర్తి చేసిన తర్వాతే చిరంజీవి తదుపరి చిత్రం గురించి కాల్‍ తీసుకుంటారు. ఇదిలావుంటే వేదళాం రీమేక్‍ని వీలయినంత క్రేజీగా మలిచేందుకు మెహర్‍ రమేష్‍ మంచి సపోర్టింగ్‍ కాస్ట్ కోసం చూస్తున్నాడు.

ఆ చిత్రంలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం. ఒరిజినల్‍లో లక్ష్మి మీనన్‍ ఆ క్యారెక్టర్‍ చేసింది. తెలుగు వెర్షన్లో సాయి పల్లవితో ఆ పాత్ర చేయిస్తే సినిమాకి క్రేజ్‍ పెరుగుతుందని భావిస్తున్నారట. అయితే చాలా సెలక్టివ్‍గా సినిమాలు చేసే సాయి పల్లవి హీరో చెల్లెలి పాత్ర చేయడానికి ఓకే అంటుందా అనేది అనుమానమే. కాకపోతే చిరంజీవి సినిమాలో నటించే అవకాశం కాబట్టి ఆమె ఈ ఆఫర్‍ని కన్సిడర్‍ చేయవచ్చు. ఎన్నో ఏళ్లుగా దర్శకత్వానికి దూరమయిన మెహర్‍ రమేష్‍ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఎఫర్టస్ పెడుతున్నాడట.