వైభవంగా ఘనంగా రామ్ చరణ్ 16

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు హమ్మయ్య అనుకునే క్షణం వచ్చేసింది. మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న గేమ్ ఛేంజర్ తో సమానంగా ఇంకా చెప్పాలంటే కొందరు ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ఆర్సి 16 ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. ముఖ్య అతిథిగా చిరంజీవి విచ్చేయగా ముంబై నుంచి హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటు ఆమె తండ్రి బోనీ కపూర్ రావడం విశేషం. సంగీతం సమకూరుస్తున్న లెజెండ్ ఏఆర్ రెహమాన్ హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుకుమార్, అల్లు అరవింద్ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మహా అయితే ఇంకో నెల లేదా నెలన్నరలో పూర్తి కాబోతున్న గేమ్ ఛేంజర్ తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని చరణ్ దీని చిత్రీకరణలో పాల్గొంటాడు. దర్శకుడు బుచ్చిబాబు ఉప్పెన తర్వాత నెలల తరబడి రాసుకున్న స్క్రిప్ట్ ఇది. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో డిఫరెంట్ గా తయారు చేశారనే టాక్ అయితే ఉంది. ప్రత్యేకంగా చరణ్ మేకోవర్ చేసుకోబోతున్నాడు. రెహమాన్ ఆల్రెడీ రెండు పాటలు ఇచ్చేయగా మిగిలిన ఆల్బమ్ ని వేసవిలోగా కంపోజ్ చేస్తారని తెలిసింది. రత్నవేలు ఛాయాగ్రహణం సమకూర్చనుండగా బడ్జెట్ వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

వచ్చే ఏడాది విడుదల లక్ష్యంగా బుచ్చిబాబు ప్లాన్ చేసుకుంటున్నాడు. పెద్ది టైటిల్ ఫిక్స్ చేశారనే ప్రచారం జరిగింది కానీ ఇవాళ ఈవెంట్ లో రివీల్ చేయలేదు. వేరే బెటర్ ఆప్షన్ దొరికితే చూద్దామని, ఒకవేళ కుదరకపోతే పెద్దికే లాక్ చేసుకుందామని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. గేమ్ ఛేంజర్, ఆర్సి 16 తర్వాత సుకుమార్ తో ఓ ప్యాన్ ఇండియా మూవీ ఉండొచ్చనే వార్త ప్రచారంలో ఉంది కానీ అదెంత వరకు నిజమో చరణ్ పుట్టినరోజు మార్చి 27న తేలిపోతుంది. ఏదైతేనేం మొత్తానికి పూజా కార్యక్రమాలతో చరణ్ కొత్త సినిమా మొదలైపోయింది. ఇక ఫ్యాన్స్ కు అప్డేట్స్ రావడమే ఆలస్యం.