పుణ్యక్షేత్రంలో పని చేసుకుంటున్న పుష్ప

ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 ది రూల్ విడుదల తేదీని మిస్ కాకూడదనే ధృడ సంకల్పంతో దర్శకుడు సుకుమార్ టీమ్ ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. తన అవసరం లేని ప్యాచ్ వర్క్ వేరే బృందంతో చేయిస్తూ ఇంకోవైపు బన్నీతో కలిసి కీలక భాగాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం పుష్పరాజ్ కర్నూలు జిల్లా యాగంటిలో చిత్రీకరణ జరుపుకుంటున్నాడు. అంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఎర్ర చందనం స్మగ్లర్ కు పనేంటని అనుకుంటున్నారా. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను సుక్కు అక్కడ ప్లాన్ చేశారు. భారీ రద్దీ లేని ప్రాంతం కావడంతో అక్కడ సెట్ చేసుకున్నారు.

యాగంటి సమీపంలో అటవీ ప్రాంతం ఉంది. పెద్దగా జనాలు తిరిగే ఏరియా కాదది. దుంగల రవాణాకు సంబంధించిన కొన్ని సీన్లతో పాటు పుష్పకు గుడికి వెళ్లే ఒక ఎపిసోడ్ ని అక్కడ తీస్తున్నారని తెలిసింది. పాటలో కొంత భాగం తీస్తారని అంటున్నారు కానీ ఇంకా క్లారిటీగా తెలియాల్సి ఉంది. ఇది కాగానే తిరిగి హైదరాబాద్ వచ్చి మళ్ళీ కొత్త లొకేషన్ కు వెళ్తారు. సుకుమార్ దృష్టి మొత్తం ముందు టాకీ పార్ట్ ఫినిష్ చేయడం మీద ఉంది. అలా అయితే పోస్ట్ ప్రొడక్షన్ కు తగినంత సమయం దొరుకుంది. బ్యాలన్స్ ఉన్న పాటలను బన్నీ, రష్మికల మీద ఏప్రిల్ లేదా మేలో షూట్ చేయొచ్చు.

ఆగస్ట్ 15 విడుదల విషయంలో మైత్రి మూవీ మేకర్స్ మీద పలురకాల ఒత్తిళ్లు ఉన్నాయి. ఇలాంటి మంచి డేట్ ని వదలొద్దని డిస్ట్రిబ్యూటర్లు పదే పదే సూచిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న అగ్రిమెంట్ మేరకు ఈ తేదీకి రిలీజ్ చేసుకుంటేనే థియేట్రికల్ విండోకు పెట్టుకున్న గ్యాప్ కు తగ్గట్టు భారీ మొత్తం అందుతుంది. ఇది మిస్ చేసుకుంటే ఆ పై సెప్టెంబర్, ఆగస్ట్ లో ఓజి, దేవర లాంటి ప్యాన్ ఇండియా సినిమాలున్నాయి కాబట్టి రిస్క్ అవుతుంది. ఇవన్నీ విశ్లేషించుకుని పుష్ప 2 తగ్గేదేలే అంటూ పరుగులు పెడుతోంది. బిజినెస్ మాత్రం క్రేజీగా ఉండబోతోందని ట్రేడ్ వర్గాల సమాచారం.