టైం దగ్గరపడుతోంది…సౌండ్ పెంచెయ్ టిల్లు

చూస్తుంటే రోజులు కర్పూరంలా కరిగిపోతున్నాయి కానీ టిల్లు స్క్వేర్ ప్రమోషన్లు మాత్రం ఇంకా మొదలుకాలేదు. మార్చి 29 కేవలం పదమూడు రోజుల దూరంలో ఉంది. టీమ్ ఇంకా చివరి నిమిషం ప్యాచప్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో హీరోతో సహా ఎవరూ బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రేపటితో అది పూర్తవుతుందని అంటున్నారు కానీ ఆ వెంటనే బ్యాలన్స్ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆఘమేఘాల మీద చేయాల్సి ఉంటుంది. పైగా సెన్సార్ ఫార్మాలిటీని త్వరగా పూర్తి చేసుకోవాలి. దర్శకుడు మల్లిక్ రామ్ తో పాటు సిద్దు జొన్నలగడ్డ ఇదంతా స్వయంగా చూసుకుంటున్నాడు.

ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్ ని టిల్లు స్క్వేర్ వదులుకోకూడదు. ఎందుకంటే సుమారు నలభై రోజులకు పైగా బాక్సాఫీస్ దగ్గర ఏర్పడిన గ్యాప్ ని సరిగ్గా వాడుకుంటే కలెక్షన్ల మోత మోగుతుంది. సరైన సినిమా రాలేదని ప్రేక్షకలు అధిక శాతం థియేటర్ల వైపు వెళ్లడమే మానేశారు. ఈ కారణంగానే డీసెంట్ టాక్ వచ్చినా ఊరి పేరు భైరవకోన, గామి, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటివి మొదటి వీకెండ్ దాటగానే బాగా నెమ్మదించాయి. హనుమాన్ సంక్రాంతి హడావిడి తర్వాత కూడా హౌస్ ఫుల్స్ నమోదు చేయడం మర్చిపోకూడదు. సో సరైన కంటెంట్ పడితే ఎండలు లెక్క చేయకుండా పబ్లిక్ పోటెత్తుతారు.

టిల్లు మర్చిపోకూడదని విషయం మరొకటి ఉంది. ఎలక్షన్ కమీషన్ ప్రకటన వచ్చేసింది కాబట్టి ఏప్రిల్ లో ఎన్నికల ఫీవర్ క్రమంగా పెరుగుతుంది. సినిమాల ప్రాధాన్యం తగ్గిపోతుంది. సో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మార్చి చివరి వారం నుంచి కనీసం ఏప్రిల్ రెండో వారం దాకా నాన్ స్టాప్ గా దులిపేయొచ్చు. మధ్యలో ఫామిలీ స్టార్ వచ్చినా ఇబ్బంది ఉండదు. అనుపమ పరమేశ్వరన్ హాట్ గ్లామర్ తో పాటు మరింత స్పైసిగా మారిన టిల్లు కంటెంట్ మీద యూత్ బోలెడు అంచనాలతో ఉన్నారు. వాటిలో సగం అందుకున్నా ఈజీగా సూపర్ హిట్ అందుకోవచ్చు. అందుకే టిల్లు సౌండ్ పెంచాలి.