గ్యాంగ్స్ అఫ్ గోదావరి తెలివైన ఎత్తుగడ

ఎన్నికలకు సంబంధించిన ప్రకటన రావడం ఆలస్యం టాలీవుడ్ అలెర్టయిపోయింది. ఎలక్షన్ల వేడి ఎప్పుడూ ఉండేదే అయినా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు చాలా రసవత్తరంగా ఉండటంతో పబ్లిక్ దృష్టి సినిమాల కంటే ఎక్కువగా వీటి మీదే ఉంది. అందుకే ఈ ప్రభావం నుంచి తప్పించుకుని రిలీజ్ డేట్లు లాక్ చేసేందుకు నిర్మాతలు తెలివిగా వ్యవహరిస్తున్నారు. మొదటి అడుగు గ్యాంగ్స్ అఫ్ గోదావరి వేసింది. కమీషన్ ప్రెస్ మీట్ పూర్తయిన నిమిషాలలోనే మే 17 విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. మే 13 ఏపీలో పోలింగ్ పూర్తయిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు.

కాకపోతే కల్కి 2898 ఏడి మే 9న రావడం గురించి అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఆ సమాచారం పక్కాగా ఉన్నందు వల్లే సితార ఎంటర్ టైన్మెంట్స్ తమ గ్యాంగ్స్ అఫ్ గోదావరిని ఫిక్స్ చేసుకుందనే కామెంట్స్ ని తేలిగ్గా కొట్టిపారేయలేం. నిజానికీ సినిమా గత డిసెంబర్ లో రావాల్సింది. కానీ సాధ్యపడలేదు. ఆ తర్వాత మార్చి 8 అనుకున్నారు. షూటింగ్ బ్యాలన్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ ఉండిపోయింది. దీంతో దాని స్థానంలో గామిని తీసుకొచ్చారు. చక్కగా ప్రమోట్ చేసుకుని హిట్ చేసుకున్నారు. త్వరగా నెమ్మదించింది కానీ ఆలోగానే బ్రేక్ ఈవెన్ దాటేసింది.

ఇప్పుడు గ్యాంగ్స్ అఫ్ గోదావరిని చూసి మిగిలిన వాళ్ళు వేగంగా అడుగులు వేసే అవకాశముంది. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఏప్రిల్ లో రిలీజ్ పెట్టుకోవడం ఎంతవరకు సేఫ్ అనే గురించి తర్జన భర్జన పడుతున్నారు. ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ ఫలితం తర్వాత స్పష్టత రావొచ్చు. ఒకవేళ అది బ్లాక్ బస్టర్ అయ్యి భారీ వసూళ్లు వచ్చాయంటే అందరికీ ధైర్యం వస్తుంది. ఫిబ్రవరి నుంచి నీరసంగా ఉన్న బాక్సాఫీస్ కు ఉత్సాహం తేవాల్సిన బాధ్యత విజయ్ దేవరకొండ మీద ఉంది. వాయిదా పడకుండా టిల్లు స్క్వేర్ మార్చి 29 వచ్చేస్తే ఆ అవకాశం సిద్ధుకు కూడా వర్తిస్తుంది.