సంపంగి మహల్లో ‘ఓమ్ భీమ్ బుష్’ అల్లరి

గత ఏడాది సామజవరగమనతో అదిరిపోయే హిట్టు అందుకున్న శ్రీవిష్ణు ఈసారి ఓం భీమ్ బుష్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. హుషారు, రౌడీ బాయ్స్ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్ తరఫున సునీల్ బలుసు నిర్మించారు. గత కొద్దిరోజులుగా వెరైటీ ప్రమోషన్లతో సోషల్ మీడియాని ఆకట్టుకుంటున్న భీమ్ బుష్ బృందం తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేసింది. మార్చి 22 విడుదల కాబోతున్న ఈ థ్రిల్లర్ కామెడీని లాజిక్స్ లేకుండా చూడమంటున్న టీమ్ అంచనాలకు తగ్గ శాంపిల్ ని ఇచ్చారు.

జనాల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని మాయమాటలు చెప్పే ముగ్గురు కుర్రాళ్ళ గ్యాంగ్ తమ బృందానికి బ్యాంగ్ బ్రోస్ పేరు పెట్టుకుని ఊరూరా తిరుగుతూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. దీనికి లీడర్ (శ్రీవిష్ణు), ఇద్దరు అసిస్టెంట్లు (ప్రియదర్శి – రాహుల్ రామకృష్ణ). ప్రజలు వీళ్ళ మాయలో పడి డబ్బు దస్కం ఇస్తూ ఉంటారు. కొందరు అఘోరాలు దెయ్యాలు తిరుగుతాయని పేరుబడిన సంపంగి మహల్లోకి వెళ్లి నిధిని తీసుకొచ్చి మగాళ్లని ఋజువు చేసుకోమని సవాలు విసురుతారు. దీంతో భైరవపురంకు బయలుదేరిన బ్యాంగ్ బ్రోస్ ఆసలు పరీక్ష అక్కడ మొదలవుతుంది.

దర్శకుడు శ్రీహర్ష డార్క్, లౌడ్ కామెడీ రెండూ మిక్స్ చేసి ఓమ్ భీమ్ బుష్ ని రూపొందించినట్టు కనిపిస్తోంది. రెండు మూడు అడల్ట్ పదాలు కూడా వినిపించేశారు. హాస్యాన్నే హైలైట్ చేస్తూ కాసింత హారర్, సస్పెన్స్ ని జోడించిన విధానం డిఫరెంట్ గా ఉంది. హీరోయిన్లు ప్రీతీ ముకుందన్, అయేషా ఖాన్ లతో పాటు ఇతర ఆర్టిస్టులను హైలైట్ చేయకుండా ముగ్గురి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. సన్నీ ఎంఆర్ సంగీతం సమకూర్చగా రాజ్ తోట ఛాయాగ్రహణం అందించారు. మండు వేసవిలో సరైన సినిమా లేక అల్లాడిపోతున్న టాలీవుడ్ ఫ్యాన్స్ కి సేద తీర్చాల్సింది ఓమ్ భీమ్ బుషే.