కావాలని చేయలేదన్న ప్రశాంత్ వర్మ

ఎదురుచూసే కొద్దీ ఆలస్యమవుతున్న హనుమాన్ ఓటిటి రిలీజ్ అభిమానుల్లో అసహనం పెంచుతోంది. దాంతో పాటే వచ్చిన సంక్రాంతి సినిమాలు ఆల్రెడీ డిజిటల్ లో టాప్ ట్రెండింగ్ ఎంజాయ్ చేసి మిలియన్ వ్యూస్ సాధించుకుంటే హనుమాన్ మాత్రం అదుగో పులి ఇదిగో తోక అంటూ కాలయాపన చేస్తోందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. హక్కులు సొంతం చేసుకున్న జీ5 కమింగ్ సూన్ అనే ప్రకటన తప్ప డేట్ ని స్పష్టంగా పేర్కొనడం లేదు. దీనికి తోడు హిందీ వెర్షన్ జియో సినిమా, కలర్స్ శాటిలైట్ ఛానల్ లో రేపే ప్రీమియర్ జరుపుకోవడం ఇంకాస్త వేడిని రగులుస్తోంది.

ఇదంతా దర్శకుడు ప్రశాంత్ వర్మ దాకా చేరిపోయింది. ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కావాలని ఆలస్యం చేయడం లేదని, కొన్ని అనుకోని అవాంతరాల వల్ల లేట్ అయ్యిందే తప్ప వేరే ఉద్దేశం లేదని, త్వరలోనే శుభవార్త ఉంటుందని సింపుల్ గా శాంతపరిచే ప్రయత్నం చేశాడు. నాలుగు రోజుల క్రితం ఇతనే అతి త్వరలో ఓటిటి రిలీజని ట్వీట్ చేయడంతో ఈ వివరణ తప్పలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం హనుమాన్ ని రెగ్యులర్ సినిమా స్కోప్ వెర్షన్ లో కాకుండా ఆర్ఆర్ఆర్ తరహాలో ఫుల్ ఐమ్యాక్స్ రేషియోలో ఇవ్వాలని నిర్ణయించుకోవడం వల్ల సాంకేతికంగా జాప్యం జరుగుతోందట.

ఇది ఖరారుగా చెప్పలేదు కానీ అంతర్గతంగా వస్తున్న లీక్ అయితే ఇదే స్పష్టం చేస్తోంది. థియేట్రికల్ రన్ బాగున్నదనే ఉద్దేశంతో జీ5 ఫిబ్రవరిలోనే ప్లాన్ చేసుకున్న ఓటిటి ప్రీమియర్ ని వాయిదా వేసుకుంది. ఇప్పుడు బాక్సాఫీస్ రన్ పూర్తయిపోయింది. ఎక్కడో కొన్ని చోట్ల మినహా మిగిలిన కేంద్రాల్లో హనుమాన్ ని తీసేశారు. అలాంటప్పుడు ఇంకా వెయిట్ చేయించడం సబబు కాదు. ఒకవేళ వంద రోజుల తర్వాత స్ట్రీమింగ్ అనుకున్నారేమో  కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది తెలివైన ఎత్తుగడగా అనిపించుకోదు. సీక్వెల్ జై హనుమాన్ పనులు మొదలుపెట్టిన ప్రశాంత్ వర్మ దాని వివరాలు వెల్లడించడం లేదు.