దర్శకుల ఎంపికలో మెగాస్టార్ జాగ్రత్తలు

దశాబ్దాల గ్యాప్ తర్వాత విశ్వంభరతో ఫాంటసీ సినిమా చేస్తున్న చిరంజీవి ప్రస్తుతం ఇది తప్ప ఇంకో ధ్యాస లేకుండా పని చేస్తున్నారు. దర్శకుడు వశిష్ట పక్కా ప్లానింగ్ తో ఎలాంటి గ్యాప్ రాకుండా నీట్ గా టాకీ పార్ట్ తీసుకుంటూ పోతున్నాడు. ఒక పాట షూట్ కూడా పూర్తయిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ సమయం డిమాండ్ చేసే కంటెంట్ కావడంతో దాని మీద వర్క్ చేయడానికి కనీసం ఆరు నెలల సమయం కావాలి. అంటే వేసవి కాగానే షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ లెక్కన మెగాస్టార్ ఇంకో మూవీ ఒప్పుకునేందుకు బోలెడంత అవకాశముంది.

ఆయన ముందు కొన్ని ఆప్షన్లున్నాయి. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక ప్రాజెక్టు అనుకుంది. స్టోరీ కూడా లాక్ చేసినట్టు వినిపిస్తోంది కానీ ఖరారుగా తెలియదు. అందుకే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా ఇవ్వలేదు. ఫైనల్ వెర్షన్ ఓకే అనుకున్నాకే ప్రకటన వస్తుంది. తమిళ దర్శకుడు హరి ఒక కథ చెప్పేందుకు చాలా ప్రయత్నిస్తున్నట్టు ఇంకో న్యూస్ తిరుగుతోంది. అయితే ఓవర్ మాస్ ఎలిమెంట్స్ తో లౌడ్ హీరోయిజంని చూపించే హరి సింగం సిరీస్ తర్వాత రెండు ఫ్లాపులు చూశారు. ప్రస్తుతం విశాల్ తో రత్నం చేస్తున్నారు. ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

భోళా శంకర్ దెబ్బకు చిరంజీవి ఓవర్ మాస్ కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఆ కారణంగానే కల్యాణ కృష్ణ సినిమాను ఇంకొద్ది రోజుల్లో పూజా కార్యక్రమనగా ఆపేశారు. అలాంటప్పుడు హరిని అంత సులభంగా నమ్ముతారని లేదు. వెంకటేష్ తో మూవీ కాగానే అనిల్ రావిపూడి మెగాస్టార్ కోసం లైన్ లో ఉన్నాడు. దిల్ రాజు ఈ కాంబో సెట్ చేయాలని తెగ ట్రై చేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ తో హిట్టు కొట్టి బాస్ దగ్గరికి వెళ్లే ప్లాన్ లో పూరి జగన్నాధ్ ఎదురు చూస్తున్నాడు. ఇన్నేసి ఆప్షన్ల మధ్య చిరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ గా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచి చూడాలి.