యూట్యూబ్ ఛానెళ్ల తీరుపై నటి ఆవేదన

‘ఫిదా’లో సాయిపల్లవి అక్క పాత్రతో మంచి గుర్తింపు సంపాదించి తెలుగు నటి.. శరణ్య ప్రదీప్. అక్కడ్నుంచి ఆమెకు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. హీరో హీరోయిన్ల అక్కడ, చెల్లి, ఫ్రెండు పాత్రల్లో ఆమె ఇప్పటికే బోలెడన్ని సినిమాలు చేసింది. ‘మండేలా’ లాంటి సినిమాల్లో హీరోయిన్ తరహా పాత్రల్లోనూ ఆకట్టుకుంది.

ఇటీవలే ఆమె ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ చేసింది. ఇందులో పద్మ అనే పాత్రలో హీరోకు కవల సోదరిగా కనిపించింది శరణ్య. ఈ చిత్రంలో హీరో సుహాస్‌‌ను మించి హైలైట్ అయింది శరణ్య క్యారెక్టర్, నటన. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆమె వల్లే కథ మలుపు తిరుగుతుంది కూడా. కొన్ని సీన్లలో శరణ్య నటన ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తుంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో విలన్ని తన్నే సీన్‌కైతే థియేటర్లు హోరెత్తిపోయాయి.

ఇక ఈ చిత్రంలో శరణ్య ఒక బోల్డ్ సీన్ కూడా చేసింది. స్కూల్లో ఆమెను వివస్త్రను చేసే సన్నివేశంలో ఆమె నగ్నంగా ఉన్నట్లు చూపిస్తారు. ఇలాంటి సన్నివేశాలు తెర మీద ఒకలా కనిపించినా.. ఒరిజినల్‌‌గా అలా ఉండదు. ఇలాంటి సీన్లు చేయాలంటే ఆర్టిస్టులకు గట్స్ ఉండాలి. శరణ్యను అందుకు అభినందించాలి.

ఐతే యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లు వ్యూస్ కోసం ఈ సీన్ గురించి చీప్ థంబ్ నైల్స్ పెట్టి శరణ్యకు ఇబ్బంది కలిగించారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నాకు ఇప్పటికే పెళ్లయింది. నా భర్త మద్దతుతోనే ఆ సీన్ చేశాను. సినిమాలో నిజానికి ఏమీ లేకపోయినా.. ఏదో ఉన్నట్లు అసభ్యంగా థంబ్ నైల్స్ పెట్టి యూట్యూబ్ ఛానెళ్లు ప్రచారం చేశాయి. అందులో అసలు అసభ్యత ఉండదు. చాలా వీడియోలకు రిపోర్ట్ కొట్టినా లాభం లేకపోయింది. ఇలా చేయడం కరెక్ట్ కాదు’’ అని శరణ్య వాపోయింది. ఇక ఈ చిత్రంలో తనకు జోడీగా నటించిన జగదీష్ ఒక కేసులో చిక్కుకోవడం గురించి అడిగితే.. దాని గురించి తనకేమీ తెలియదు కాబట్టి కామెంట్ చేయలేనని శరణ్య చెప్పింది.