మాధవన్ కోసమే సైతాన్ చూడాలి

గామి, భీమా, ప్రేమలంటూ తెలుగు సినిమాల హడావిడిలో పడిపోయాం కానీ నిన్న బాలీవుడ్ మూవీ సైతాన్ చెప్పుకోదగ్గ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. అజయ్ దేవగన్ మాత్రమే హీరో అయితే అంత ఆసక్తి కలిగేది కాదు కానీ మాధవన్, జ్యోతిక లాంటి సౌత్ క్యాస్టింగ్ ఉండటంతో సౌత్ ఆడియన్స్ లో దీని మీద ఆసక్తి నెలకొంది. గత ఏడాది గుజరాతి భాషలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన వష్ కి ఇది అధికారిక రీమేక్. సుమారు 14 కోట్లకు పైగా ఓపెనింగ్ వచ్చినా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. సోలో రిలీజ్ కావడంతో ఆదరణ దక్కుతోంది. ఇంతకీ కథాకమామీషు ఏంటో చూద్దాం.

కబీర్(అజయ్ దేవగన్) జ్యోతి(జ్యోతిక) భార్యా భర్తలు. టీనేజ్ కూతురు జాన్వీ (జంకీ బొదివాలా) అంటే ప్రాణం. సెలవుల కోసం స్వంత గ్రామానికి వెళ్లే క్రమంలో ఓ రెస్టారెంట్ లో వన్ రాజ్ (మాధవన్) పరిచయమవుతాడు. ఆ జంట గెస్ట్ హౌస్ కు చేరుకున్నాక సెల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందనే వంకతో వన్ రాజ్ వీళ్ళుండే చోటుకి వస్తాడు. మెల్లగా జాన్వీతో పరిచయం పెంచుకుని వశీకరణ విద్య ద్వారా తానేం చెబితే అది చేసే దారుణమైన స్థితికి తీసుకెళ్తాడు. వన్ రాజ్ మాములు మనిషి కాదని గుర్తించిన కబీర్ తన కుటుంబాన్ని ఆ దుర్మార్గుడి నుంచి ఎలా కాపాడుకున్నాడనేదే స్టోరీ.

భయంకరమైన మలుపులు లేకపోయినా థ్రిల్స్ కు లోటు లేకుండా దర్శకుడు వికాస్ బహ్ల్ ఒరిజినల్ వెర్షన్ దాదాపుగా సీన్ టు సీన్ ఫాలో అయ్యాడు. విరూపాక్ష, మా ఊరి పొలిమేర లాంటి హారర్ సినిమాలు చూసిన మనకు సైతాన్ మరీ స్పెషల్ గా అనిపించదు కానీ మాధవన్ పెర్ఫార్మన్స్ మాత్రం ఓ రేంజ్ లో పేలింది. అమ్మాయిని వశపరుచుకొని తల్లితండ్రులను భయపెడుతూ క్రూరత్వంతో నిండిన విలనిజంని అద్భుతంగా పండించాడు. తర్వాత ప్రశంసలు జంకీకి దక్కుతాయి. అజయ్, జ్యోతిక తమ పరిధి మేరకు చక్కగా నటించారు. తగినంత ఖాళీ సమయం ఉంటే సైతాన్ మీద లుక్ వేయొచ్చు.