విక్రమార్కుడు-2 స్క్రిప్టు రెడీ.. కానీ

టాలీవుడ్లో తిరుగులేని విజయం సాధించిన మాస్ మసాలా సినిమాల్లో ‘విక్రమార్కుడు’ ఒకటి. రాజమౌళి కెరీర్లో ఎదుగుతున్న దశలో రవితేజ హీరోగా ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. రిలీజ్ టైంకి దీని రేంజ్ తక్కువే. కానీ ఈ సినిమా ఊహించని స్థాయి విజయాన్నందుకుంది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ.. ఇలా పలు భాషల్లో రీమేక్ చేశారు. ప్రతి చోటా సూపర్ హిట్ అయింది. ‘విక్రమార్కుడు’ సీక్వెల్ గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది.

‘విక్రమార్కుడు’ రచయిత విజయేంద్ర ప్రసాదే స్వయంగా ఈ స్క్రిప్టులో భాగం అయ్యారు. కానీ ఈ సీక్వెల్ ఎంతకీ పట్టాలెక్కడం లేదు. అందుక్కారణం.. రాజమౌళి రేంజ్ మారిపోయి ‘విక్రమార్కుడు’ లాంటి సగటు మాస్ మూవీకి సీక్వెల్ తీసే స్థితిలో లేకపోవడం. మరోవైపు హీరో రవితేజకు కూడా సీక్వెల్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడం. ఐతే ‘విక్రమార్కుడు-2’ తీయాలని తనకెంతో కోరికగా ఉందని.. ఈ సినిమా స్క్రిప్టు కోసం ఖర్చు పెట్టుకున్న నిర్మాత కేకే రాధామోహన్ అంటున్నారు.

రాధామోహన్ నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘భీమా’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన ‘విక్రమార్కుడు’ సీక్వెల్ గురించి మాట్లాడారు. ‘‘విక్రమార్కుడు సీక్వెల్ సబ్జెక్ట్ రెడీగా ఉంది. అది కేవలం నా కోసమే రూపొందింది. విక్రమార్కుడు-2 అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాం. కానీ సమస్యంతా ఆర్టిస్టుల దగ్గరే ఉంది. రవితేజ గారు ఈ సినిమా విషయంలో ఆసక్తితో లేరు. నేను ముందు ఆయన్ని ఒప్పించాలి. సంపత్ నంది ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి ఆసక్తితో ఉన్నాడు. నేను, సంపత్, విజయేంద్ర ప్రసాద్ గారు కలిసి ‘విక్రమార్కుడు-2’ స్క్రిప్ట్ మీద పని “చేశాం. కానీ ఇప్పుడు సంపత్ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రవితేజ గారు చేయకుండా విక్రమార్కుడు-2 ఉండదు. సరైన కాంబినేషన్ కుదరకుండా ఈ సినిమాను నేను నిర్మించను. ఏం జరుగుతుందో చూడాలి అని రాధామోహన్ తెలిపారు. మరి రవితేజ ఒప్పుకుని ఎప్పటికైనా ‘విక్రమార్కుడు-2’ పట్టాలెక్కుతుందేమో చూడాలి.