పారని వ్యూహానికి శపథంతో ఉపశమనమా

ఇటీవలే విడుదలైన రామ్ గోపాల్ వర్మ వ్యూహంని ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. పొలిటికల్ స్పూఫ్ లు యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో బాగుంటాయి కానీ ఇలా టికెట్లు అమ్మి థియేటర్లో చూడమంటే కష్టమని మరోసారి ఋజువు చేశారు. గతంలో కడప రాజ్యంలో అమ్మ బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి చిత్రాలకు ఇదే పరాభవం ఎదురైనా పొలిటికల్ సపోర్ట్ ఉన్న వర్మ వీటిని తీయడం మానుకోలేదు. వ్యూహంకి కనీసం వైసిపి అభిమానులను నుంచి సైతం మద్దతు దక్కలేదు. అయినా యాత్ర 2నే కాపాడలేని ఫాలోయర్స్ దీనికి మాత్రం ఏం చేయగలరు.

ఇంత జరిగినా వ్యూహం సీక్వెల్ శపథం రిలీజ్ కు రెడీ అవుతోంది. వాస్తవానికి ఇది మార్చి 8 వచ్చేయాలి. కానీ సెన్సార్ ఆలస్యం కావడంతో ఇంకో వారం వాయిదా వేసేలా ఉన్నారు. వ్యూహం దాదాపు నిర్మాత స్వంతంగా పంపిణి చేసుకున్నారట కానీ ఎంతో కొంత పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు లేకపోలేదు. వ్యూహం ద్వారా వచ్చిన నష్టాల గురించి అడిగినప్పుడు శపథంకి సహకరిస్తే దాని ద్వారా వచ్చే సొమ్ముని ఏదోలా సర్దుతామని చెబుతున్నారట. అయినా మొదటి భాగాన్ని ఎవరూ పట్టించుకోనప్పుడు అదే పనిగా సెకండ్ పార్ట్ చూసేందుకు డబ్బులిచ్చి వస్తారా అనేది వేయి డాలర్ల ప్రశ్న.

ఇవి ఆడినా ఆడకపోయినా వర్మకు పెద్ద తేడా పడదు కానీ వ్యూహంని వీలైనంత త్వరగా ఓటిటిలో వదిలేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇంతకు ముందు కొన్ని పే పర్ వ్యూ మోడల్ లో వదిలి విమర్శలు అందుకున్న వర్మ ఈసారి అదే రిపీట్ చేస్తారో లేక ఏదైనా ఓటిటిలో ఫ్రీ స్టీమింగ్ కి వదిలి పెడతారో చూడాలి. ఎన్నికల ప్రచారానికి వ్యూహం, శపథం కంటెంట్లను వాడుకోవచ్చని చూసిన అధికార పార్టీ అనుచరులకు అవి ఎంత మాత్రం ఉపయోగపడేలా కనిపించకపోవడంతో లైట్ తీసుకున్నారు. అన్నట్టు శపథంకి కొనసాగింపుగా ఇంకో సినిమా తీస్తానని వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కొసమెరుపు.