తీవ్ర వివాదాల దిశగా అదా శర్మ సినిమా

గత ఏడాది ది కేరళ స్టోరీతో కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా మారిన దర్శకుడు సుదిప్తో సేన్, హీరోయిన్ అదా శర్మ ఈసారి బస్తర్ ది నక్సల్ స్టోరీతో మార్చి 15 ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇవాళ రిలీజ్ చేసిన ట్రైలర్ అప్పుడే వివాదాల దిశగా వెళ్తోంది. 14 ఏళ్ళ క్రితం ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులతో జరిగిన ఎన్ కౌంటర్ లో 75 సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించడం దేశాన్ని కుదిపేసింది. ఆ సమయంలో నక్సలైట్లకు మద్దతు తెలుపుతూ ఢిల్లీ జెఎన్యు యూనివర్సిటికి చెందిన కొందరు విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారనే వార్త సంచలనం రేపింది. దీనికి సంబంధించిన కథనాలతో మీడియా ఊగిపోయింది.

ఇదే పాయింట్ ని తీసుకుని బస్తర్ ని తీశారు. పదిహేను వేలకు పైగా పోలీసులు, సోల్జర్లు అన్యాయంగా నక్సల్స్ జరిపిన పోరాటంలో బలయ్యారని వాళ్ళ తరఫున గొంతు వినిపించేందుకే బస్తర్ తీశామని మేకర్స్ చెబుతున్నారు. ఇంకో పది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలని పలు వర్గాలు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరం వచ్చే అవకాశం లేకపోలేదు. ట్రైలర్ లో ప్రభుత్వ వ్యవస్థ మీద, రాజకీయ నాయకుల ద్వంద్వ వైఖరి మీద, శత్రుదేశం చేసిన అరాచకాల మీద బలమైన కౌంటర్లు, ఎపిసోడ్లు ఉన్నట్టు చూపించారు.

మరి సవ్యంగా రిలీజ్ అవుతుందా లేదానేది ఇప్పుడే చెప్పలేం. ది కేరళ స్టోరీ లాగే ఇది కూడా ఒక ఎజెండాతో తీశారు తప్పించి నిజాలు చెప్పేందుకు కాదని మరో వర్గం ఆరోపిస్తోంది. సుదీప్తో సేన్ వీటిని కొట్టి పారేస్తున్నారు. గతంలో ది కాశ్మీర ఫైల్స్ టైంలో ఎంత రభస జరిగిందో తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సినిమాలకు సానుకూలంగా వ్యవహరించి రిలీజ్ అయ్యేలా చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో 2010లో జరిగిన బస్తర్ విషాదాన్ని ఇప్పటి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆ టైంలో కాంగ్రెస్ రూలింగ్ ఉండటం ఫైనల్ ట్విస్టు.