నువ్వు నేను ఇంకొంచెం ఆగాల్సింది

రీ రిలీజ్ ట్రెండ్ కత్తి మీద సాములా మారిపోయింది. క్రేజ్ ఉంది కదాని పాత బ్లాక్ బస్టర్లని థియేటర్లకు తీసుకొస్తుంటే అనూహ్య ఫలితాలు దక్కుతున్నాయి. వర్కౌట్ అవుతాయనుకున్నవి తుస్సుమంటున్నాయి. ఒకప్పుడు డిజాస్టర్స్ గా ఆడియన్స్ నో చెప్పినవి ఇప్పుడు హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నాయి. ఇటీవలే సమరసింహారెడ్డిని మంచి క్వాలిటీ, డాల్బీ సౌండ్ తో రీ మాస్టర్ చేసి వదిలితే సరైన ప్రమోషన్ లేక, టైమింగ్ తేడా కొట్టి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను రప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ లిస్టులో చేరేందుకు మరో సూపర్ హిట్ సిద్ధమవుతోంది. అదే నువ్వు నేను.

2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ సెన్సేషన్ హీరో ఉదయ్ కిరణ్ ని ఒక్కసారిగా స్టార్ గా మార్చేసింది. భారీ వసూళ్లతో చాలా కేంద్రాల్లో వంద రోజులు ఆడి బయ్యర్లకు కనకవర్షం కురిపించింది. కాలేజీ కామెడీ, ఆర్పి పట్నాయక్ పాటలు యువతను ఊపేశాయి. రిపీట్ గా చూసిన ఆడియన్స్ లక్షల్లో ఉంటారు. దెబ్బకు తేజ డిమాండ్ ఏ స్థాయిలో పెరిగిందంటే తర్వాతి కాలంలో ఏకంగా మహేష్ బాబుతో ఛాన్స్ కొట్టేసేంత. ఉదయ్ కిరణ్ ఈ ఒక్క విజయం వల్లే ఓ మూడేళ్ళ పాటు డైరీలో ఒక్క పేజీ ఖాళీ లేనంత బిజీగా నాన్ స్టాప్ సక్సెస్ ఎంజాయ్ చేశాడు.

తర్వాత వరస ఫ్లాపులు, విధి వంచింది కాలం చేయడం ఫ్యాన్స్ మర్చిపోలేని గాయం. అయితే బాక్సాఫీస్ వద్ద ఒకరకమైన స్థబ్దు వాతావరణం ఉన్న టైంలో నువ్వు నేను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు సిద్దార్థ్ ఓయ్ నే ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసిన జనాలు నువ్వు నేనుని అంతకు మించి ఆదరిస్తారని అంటున్నారు. అసలే ఆపై వారం టిల్లు స్క్వేర్ ఉంటుంది. ఆల్రెడీ భారీగా ఉన్న అంచనాలకు కుర్రకారు దాని కోసం రెడీగా ఉంటారు. పైగా మార్చి 21న వచ్చే నువ్వు నేనుకి పోటీగా మరుసటి రోజు శ్రీవిష్ణు ఓం భీం బుష్ ఉంటుంది.