జాన్వీ కపూర్ అంత రిస్క్ చేస్తుందా

టాలీవుడ్ ఎంట్రీకి దేవర లాంటి సరైన ప్యాన్ ఇండియా మూవీని ఎంచుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి రామ్ చరణ్ 16లోనూ అవకాశమొచ్చిందని తండ్రి బోనీ కపూర్ స్వయంగా చెప్పడం తెలిసిందే. ఈ విషయాన్ని కూతురు ధృవీకరించకపోయినా అంత పెద్ద నిర్మాత స్థానంలో ఉన్న మనిషి మాట వరసకు అబద్దం చెప్పరు కదా. వీటి సంగతలా ఉంచితే పుష్ప 2 ది రూల్ లో ఒక స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్ ఈమెను సంప్రదించినట్టు వచ్చిన వార్త ఫ్యాన్స్ మధ్య గట్టిగా తిరుగుతోంది. ఊ అంటావా ఉహూ అంటావాని మించేలా ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినట్టు టాక్.

కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే జాన్వీ నిజంగా ఇది ఒప్పుకుంటుందానే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే పుష్ప 1లో చేసిన సమంతా అప్పటికే స్టార్ స్టేటస్ మొత్తం చూసేసి అందరు హీరోలతో జోడిగా చేసింది. ఒకవేళ పుష్పకు ఏదైనా తేడా జరిగి ఉంటే సామ్ కు ఎలాంటి నష్టం ఉండేది కాదు. జాన్వీ కపూర్ కేసు వేరు. ఇంకా తెలుగులో తెరంగేట్రమే జరగలేదు. పైగా దేవర కంటే ముందు ఆగస్ట్ 15 పుష్ప 2 రిలీజవుతుంది. సో తొలి పరిచయం కార్డు అందులో వేయాల్సి ఉంటుంది. దీనికి బోనీ కపూర్ ఒప్పుకుంటాడానేది పెద్ద ప్రశ్న. టీమ్ అయితే దీని గురించి ఎలాంటి లీక్ ఇవ్వడం లేదు.

ఒకవేళ చేస్తే మాత్రం షాకింగ్ అండ్ స్పెషల్ అనుకోవచ్చు. ఈ స్పెషల్ సాంగ్ కోసం దిశా పటానిని కూడా అడిగారట కానీ డేట్ల సమస్య వల్ల ఎస్ చెప్పలేదనే టాక్ కూడా ఉంది. ఆర్య లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీలోనే ఆ అంటే అమలాపురం లాంటి ఐటెం సాంగ్ తో అదరగొట్టిన సుకుమార్ పుష్ప 2 విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో వేరే చెప్పాలా. ఫస్ట్ లిరికల్ వీడియోగా దీన్నే రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా మైత్రి బృందంలో ఉంది. కాకపోతే షూట్ చేస్తే తప్ప నిర్ణయం తీసుకోలేరు. అల్లు అర్జున్ మాత్రం విడుదల తేదీ మిస్ చేయకూడదనే ఉద్దేశంతో సుక్కుతో డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు.