అక్కడేమో సంచలనం ఇక్కడేమో నీరసం

మలయాళంలో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన భ్రమ యుగం గత శుక్రవారం తెలుగులో విడుదలై అంచనాలు అందుకోలేకపోయింది. ఒరిజినల్ వెర్షన్ టాక్ చూసి సంచనాలు నమోదు చేస్తుందేమోననే ఉద్దేశంతో సితార సంస్థ ప్రత్యేక శ్రద్ధతో డబ్బింగ్ చేయించినప్పటికీ ఫలితం నిరాశపరిచింది. పూర్తి బ్లాక్ అండ్ వైట్, 35 ఎంఎంలో ఉన్న ఈ మూవీని మన ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. కేవలం మూడు పాత్రలతో పాడు బడిన బంగాళా చుట్టూ హారర్ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికరంగా నడిపించినప్పటికీ అంత స్లో సీరియస్ డ్రామాని అంగీకరించడం టాలీవుడ్ జనాల వల్ల కాలేదు.

ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల వసూళ్లను మొదటి వారంలోనే దాటేసిన భ్రమ యుగం ఏపీ, తెలంగాణలో మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. వాస్తవానికి మొన్న శుక్రవారం చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేదు. సుందరం మాస్టర్, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, సిద్దార్థ్ రాయ్ ఇవేవి కనీస స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఈ అవకాశాన్ని ముందే ఊహించిన భ్రమ యుగం నిర్మాతలు దానికి అనుగుణంగానే మంచి రిలీజ్ వచ్చేలా చూసుకున్నారు. కానీ లెక్క మారింది. ట్విట్టర్ హ్యాండిల్ లో రెండు రోజుల క్రితం నుంచే ప్రమోషన్లు ఆపేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ చూడాలి. పక్క భాషలో ఎంత గొప్పగా ఆడినా సరే ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదానే దాని మీద ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిందే. పైగా మమ్ముట్టి కేరళలో ఎంత పెద్ద హీరో అయినా ఇక్కడ మార్కెట్ లేదు. యాత్ర 2 వర్కౌట్ కాకపోవడానికి కారణాలు ఏమున్నా వాటిలో ఇది కూడా ఒకటి. మార్చిలో ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ వస్తున్నాయి. ఇవి యూత్ ఫుల్ కంటెంట్ కావడం వల్ల కనెక్ట్ అయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం. కెజిఎఫ్, కాంతార లాంటి ఎక్స్ ట్రీమ్ కంటెంట్ ఉన్న డబ్బింగులు మాత్రమే ఆడుతున్న తరుణంలో ఇవి ఎలాంటి ఫలితాలు అందుకుంటాయో చూడాలి.