కీరవాణి సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోతోంది

దశాబ్దాల క్రితం గొప్ప సినిమాలు, బ్లాక్ బస్టర్స్ తో ఊపేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లకు ఒక దశ దాటాక అవకాశాలు తగ్గడం సహజం. ముందున్న జోరు చూపించలేక, కొత్త తరంతో పోటీ పడలేక అనఫీషియల్ గా రిటైర్మెంట్ తీసుకునే వాళ్లే ఎక్కువ. ఎంఎం కీరవాణి గత పదేళ్లలో రాజమౌళికి తప్ప ఆయన స్థాయి మ్యూజిక్ ఇంకెవరికి ఇవ్వలేకపోయారన్నది వాస్తవం. దమ్ము తర్వాత ఇతర దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, తమన్, మిక్కీ జె మేయర్ లాంటి ఆప్షన్లు చూసుకున్నారు కానీ మరగతమణి(కీరవాణి తమిళ పేరు)ని దూరంగా ఉంచిన మాట కాదనలేం. ఆస్కార్ వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.

తిరిగి ఒకప్పటి వైభవానికి కీరవాణి పరుగులు పెడుతున్నారు. అగ్ర హీరోలు పిలిచి ఛాన్సులు ఇస్తున్నారు. తక్కువ టైం ఉన్నప్పటికీ నా సామిరంగ కోసం నాగార్జున వేరే ఆలోచన చేయకుండా ఆయన్ని ఎంచుకున్నారు. ఆల్బమ్ గొప్పగా రాకపోయినా అంత ఒత్తిడిలో సైతం మంచి స్కోర్ ఇచ్చారు. అన్నదమ్ములు చిరంజీవి విశ్వంభర, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకి స్వరాలు సమకూరుస్తున్నది ఎవరో తెలుసుగా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మహేష్ బాబు జక్కన్న కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీతో కీరవాణి స్థాయి మరోసారి అంతర్జాతీయ వీధుల్లో మారుమ్రోగనుంది.

ఇక్కడితో అయిపోలేదు. కొత్త దర్శకులు సైతం కీరవాణినే కోరుకుంటున్నారు. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా రూపొందబోయే లవ్ మీ ఇఫ్ యు డేర్ కి ఈయన్నే తీసుకున్నారు. ఆర్య రేంజ్ లో పాజిటివ్ వైబ్ తనకు ఈ కథ విన్నప్పుడు అనిపించిందని దిల్ రాజు చెప్పడం చూస్తే ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. ఇలా చిన్న పెద్ద అందరూ కీరవాణిని కోరుకోవడం చూస్తే గురువు గారి గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. తమన్ దొరక్క, పక్క రాష్ట్రంలో ఉండే అనిరుద్ లాంటి వాళ్ళ మీద అతిగా ఆధారపడలేక ఇలా కీరవాణికే ఆఫర్లు క్యూ కట్టడం చూస్తే కెరీర్ ఇంకో పదేళ్లు పొడిగించినట్టే.