చిత్రలహరి 2 ఇద్దరికీ చాలా అవసరం

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ మీద ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయిందనే వార్త ఎంత బలంగా తిరిగినా నిర్మాణ సంస్థ నుంచి అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఇటీవలే టైటిల్, టీజర్ కంటెంట్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి నోటీసులు రావడం టీమ్ ను ఆలోచనలో పడేసింది. సంపత్ నంది దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ లో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకోవాలని తొలుత అనుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఏకంగా సినిమానే క్యాన్సిలయ్యే పరిస్థితి వచ్చేలా ఉంది.

అధికారికంగా అనౌన్స్ చేసేదాకా దీని గురించి ఇంతకన్నా చెప్పలేం కానీ సాయి ధరమ్ తేజ్ కు మంచి హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయిన చిత్రలహరికి సీక్వెల్ తీసే ప్రతిపాదనని మైత్రి మూవీ మేకర్స్ సీరియస్ గా చూస్తున్నారట. దర్శకుడు కిషోర్ తిరుమల ప్రస్తుతం ఈ పనిలోనే ఉన్నట్టు తెలిసింది. కిషోర్ గత చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు నిరాశ పరిచింది. శర్వానంద్, రష్మిక మందన్న జంట బాగున్నా కంటెంట్ తేడా కొట్టేసింది. దీనికి ముందు రెడ్ కూడా సోసోగానే ఆడింది. అందుకే ఒక స్టార్ హీరో మూవీ చేయి దాకా వచ్చి జారిపోయిన కిషోర్ తిరుమల చిత్రలహరి 2 స్క్రిప్ట్ రాస్తున్నారట.

మాములుగా విజువల్ గ్రాండియర్స్ కి కొనసాగింపులు తీయడం సహజం. లేదా స్టార్ హీరో నటించిన ఇండస్ట్రీ హిట్ కి పార్ట్ 2 అంటే సముచితంగా ఉంటుంది. కానీ చిత్రలహరి ఈ రెండు కోవలోకి రాదు. బాగానే ఆడింది కానీ మరీ విరగబడే స్థాయిలో కాదు. యూత్ లో ఈ చిత్రానుకున్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని సాయి ధరమ్ తేజ్ మార్కెట్ పరిమితుల్లోనే నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే కథ కంటిన్యూయేషన్ ఉండకపోవచ్చట. టైటిల్ మాత్రమే చిత్రలహరి 2 అని పెట్టి పూర్తిగా ఫ్రెష్ స్టోరీ చెబుతారని తెలిసింది. అంతా ఓకే అనుకున్నాక అనౌన్స్ మెంట్ ఇస్తారు.