బెడిసికొట్టిన వ్యూహం….మళ్ళీ వాయిదా

రేపు విడుదల కావాల్సిన వ్యూహం వాయిదా పడింది. థియేటర్ల కేటాయింపు జరిగిపోయి ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టాక ఈ పరిణామం జరగడంతో ఆన్ లైన్ లో వాటిని తీసేయడం మొదలుపెట్టారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయాన్ని స్వయంగా కన్ఫర్మ్ చేశాక రేపు చూద్దామనుకున్న కాసిన్ని ప్రేక్షకులకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు డేట్లు మారిపోయి వ్యూహం మార్చి 1, శపథం మార్చి 8 వస్తాయని ప్రకటించారు. సెన్సార్ కారణాలు కాదని, ఇంకొంచెం ఆగితే మాకు కావాల్సిన థియేటర్లు దొరుకుతాయనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేశామని వర్మ చెబుతున్నారు.

నిజానికి వ్యూహం మీద ఎలాంటి బజ్ లేదు. సాధారణ ప్రేక్షకులు వర్మ సినిమాలకు ఎప్పటి నుంచో దూరంగా ఉన్నారు. పైగా పొలిటికల్ ఎజెండాతో తీసిన ఇలాంటి వాటికి ఆదరణ ఏ మేరకు దక్కుతుందో తెలిసిందే. యాత్ర 2కి ఎంత హడావిడి జరిగినా చివరికి డిజాస్టరే అయ్యింది. యాత్ర 1లో కనీసం సగం కూడా అందుకోలేకపోవడం పార్టీ వర్గాలను నిర్ఘాంతపరిచింది. రాజధాని ఫైల్స్ కాస్త సిన్సియర్ గా తీసినప్పటికీ డ్రామా మరీ ఎక్కువైపోవడంతో ఇదీ ఆడలేదు. ఇప్పుడు వ్యూహం వంతు వచ్చింది. ప్రమోషన్లకు సమయం చాల్లేదని ఇంకో సాకు చెబుతున్నారు కానీ నమ్మశక్యంగా లేదు.

ప్రాక్టికల్ గా చూస్తే రేపున్న విపరీతమైన చిన్న సినిమాల పోటీలో వ్యూహంని పట్టించుకునే పరిస్థితి లేదు. పైగా బుకింగ్స్ కూడా మరీ అన్యాయంగా జరిగాయి. అయినా మార్చి 1 కూడా కాంపిటీషన్ తక్కువేం లేదు. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మీద అంచనాలు పెరుగుతున్నాయి. డ్యూన్ పార్ట్ 2, రజాకార్, చారీ 111 బరిలో ఉన్నాయి. ఇదింకా క్లిష్టమైన పరిస్థితి. అయినా వర్మ బొమ్మ ఎప్పుడు వచ్చినా రెస్పాన్స్ లో ఎలాంటి మార్పు ఉండదని ట్రేడ్ వర్గాలు కామెంట్ చేయడంలో నిజం లేకపోలేదు. కేవలం వారం గ్యాప్ లో సీక్వెల్ ని కూడా రిలీజ్ చేయడం వర్మకు మాత్రమే సాధ్యం.