శ్రీవల్లి పాత్ర అంచనాలకు మించి

పుష్ప 2 ది రైజ్ లో అందరూ అల్లు అర్జున్ గురించే ఆలోచిస్తున్నారు కానీ ఈసారి రష్మిక మందన్నకు ఊహించని స్థాయిలో ప్రాధాన్యం ఉంటుందని యూనిట్ నుంచి అందుతున్న లీక్. మొదటి భాగంలో పెళ్లి చేసుకోవడం వరకే నడిపించిన దర్శకుడు సుకుమార్ ఈసారి శ్రీవల్లిని గర్భవతిగా చూపిస్తాడట. ఈ థ్రెడ్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని, పుష్పరాజ్ లోని సున్నితత్వం కొత్తగా ఆవిష్కరించారని అంటున్నారు. పుష్ప 1లో తక్కువ మోతాదులో మదర్ సెంటిమెంట్ తప్ప ఇంకో భావోద్వేగం హైలైట్ కాలేదు. కానీ పుష్ప 2లో ఆ లెక్కలన్నీ సరిచేశారని సమాచారం.

సో యానిమల్ తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న ఇమేజ్ అమాంతం రెట్టింపయ్యేలా సుక్కు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారని తెలిసింది. పుష్ప, శ్రీవల్లి కలిసి థియేటర్ లో ఇంద్ర సినిమా చూసేందుకు వెళ్లే ఎపిసోడ్ ని ఓ రేంజ్ లో షూట్ చేసినట్టు ఆల్రెడీ టాక్ ఉంది. గంగమ్మ జాతర తర్వాత దీని గురించే మాట్లాడుకుంటారట. మొత్తానికి గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉండేలా సుకుమార్ ఈసారి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు. జపాన్ వెళ్లి అక్కడి మాఫియా డాన్ ని హతమార్చే ట్రాక్ గురించి గతంలో మా సైట్ ఎక్స్ క్లూజివ్ గా చెప్పిన సంగతి తెలిసిందే.

ఆగస్ట్ 15 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ఉండేందుకు టీమ్ అన్నిరకాలుగా డే అండ్ నైట్ కష్టపడుతోంది. ఏ మాత్రం వాయిదా పడినా ఎగరేసి తీసుకుపోయేందుకు ఇతర ప్యాన్ ఇండియా సినిమాలు కాచుకుని ఉండటంతో మైత్రి బృందం ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే సంకల్పంతో ఉంది. కీలకమైన భాగాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ లో డబ్బింగ్ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ రీ రికార్డింగ్ కనీసం నెల రోజుల టైం డిమాండ్ చేయడంతో దానికి అనుగుణంగా రఫ్ కాపీని సిద్ధం చేయాలి. పుష్ప 3కి సంబంధించిన ప్రకటన త్వరలోనే రావొచ్చు.