భగవంత్ కేసరి – స్కంద రెండూ దులిపేశాయి

ఓటిటిల కాలంలో జనాలు కొత్త సినిమాలను శాటిలైట్ ఛానల్స్ లో చూడటం బాగా తగ్గించేశారు. అందుకే ఎంత బ్లాక్ బస్టర్ అయినా సరే టిఆర్పి రేటింగ్స్ రావడం కష్టమైపోయింది. గత ఏడాది బలగం, వీరసింహారెడ్డి లాంటి వాటికి మినహాయించి మిగిలినవి పెద్దగా అద్భుతలేం చేయలేదు. వాల్తేరు వీరయ్య సైతం వెనుకబడింది. తాజాగా భగవంత్ కేసరికి వేసిన ప్రీమియర్ కు అర్బన్ నుంచి ఏకంగా 9.36 రేటింగ్ రావడం విశేషం. ఇంకోవైపు స్కందకు 8.47 నమోదు కావడం గమనార్హం. రెండింటి బాక్సాఫీస్ ఫలితాలు ఒకటే కాకపోయినా బుల్లితెరపై మాత్రం దుమ్ము దులపడం విశేషం.

ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. బాలయ్యకు ఇళ్లలో ఉన్న ఫాలోయింగ్ వాటిలో ప్రధానమైంది. గత ఏడాది వీరసింహారెడ్డి, అంతకు ముందు అఖండ సైతం టీవీలో భారీ స్పందన దక్కించుకున్నాయి. భగవంత్ కేసరిలో శ్రీలీల సెంటిమెంట్ ప్రధాన ఎలిమెంట్ గా మారడంతో చూసే వాళ్ళ కౌంట్ పెరిగింది. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురైన స్కందకి ఈ స్థాయిలో జనాలు చూడటం ఆశ్చర్యమే. థియేటర్లలో రిలీజైన టైంలో నెగటివ్ టాక్ విని దూరంగా ఉండిపోయిన ఆడియన్స్ ఎక్కువ. వాళ్లంతా టీవీ ప్రీమియర్ చూసి ఆ ముచ్చట తీర్చుకున్నారు.

దర్శకుడు బోయపాటి శీనుకి గతంలో వినయ విధేయ రామకు ఇలాగే జరిగింది. బాక్సాఫీస్ వద్ద సినిమా దారుణంగా పోతే ఛానల్ లో ఎన్నిసార్లు వచ్చినా మంచి రేటింగ్స్ తో భారీ ఆదాయాన్ని తీసుకొచ్చింది. ఓటిటిల వల్ల శాటిలైట్ మార్కెట్ దెబ్బ తింటున్న టైంలో ఇలాంటి రేటింగ్స్ ఎంతైనా నిర్మాతలకు ఊపిరినిచ్చేవే. డిజిటల్ మార్కెట్ వల్ల టీవీ చూసేవాళ్ళు తగ్గిపోతున్నారు. వేసిన టైంలో యాడ్స్ ని భరిస్తూ మూడు గంటల సేపు కూర్చునే ఓపిక తగ్గిపోతోంది. అందుకే టిఆర్పి తగ్గుదల కనిపిస్తోంది. ఇప్పటికీ అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.