నిశ్శబ్దంగా పని చేసుకుంటున్న ఈగల్

మాస్ మహారాజా కొత్త సినిమా అంటేనే అదో సెలబ్రేషన్ లా ఉంటుంది అభిమానులకు. కానీ ఈగల్ విషయంలో ఆ స్థాయి బజ్ కనిపించడం లేదని కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా కంటెంట్ మీద నమ్మకంతో దర్శక నిర్మాతలు ఓవర్ పబ్లిసిటీ చేయకపోవడం వల్లే లో ప్రొఫైల్ కొనసాగుతోంది. హీరో రవితేజ, నిర్మాత టిజి విశ్వప్రసాద్, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఇస్తున్న ఇంటర్వ్యూలలో చాలా కూల్ గా ఇందులో ఉన్న అంశాలను ప్రస్తావిస్తున్నారు కానీ ఓవర్ గా ఎలివేట్ చేసి చెప్పడం కానీ, లేనిపోని బిల్డప్ లు ఇవ్వడం కానీ ఏ కోశానా చేయడం లేదు.

అడ్వాన్స్ బుకింగ్స్ మరీ భీకరంగా లేకపోయినా ఉదయం ఆట అయ్యాక ఒక్కసారిగా టాక్ వచ్చే మార్పు అనూహ్యంగా ఉంటుందని టీమ్ నమ్ముతోంది. టీజర్, ట్రైలర్ లో ట్విస్టులు రివీల్ కాకూడదనే ఉద్దేశంతో జాగ్రత్తగా కట్ చేయడం వల్ల ఇదేదో యాక్షన్ మూవీ అనుకున్న ప్రేక్షకులు చాలానే ఉన్నారు. కానీ ప్రాపర్ కమర్షియల్ ఫార్మాట్ లో పత్తి రైతుల సమస్య బ్యాక్ డ్రాప్ లో ఎవరూ ఊహించని ట్రీట్ మెంట్ ని ఈగల్ రూపించారట. ముఖ్యంగా చివరి ముప్పావు గంట ఊహించని ఎలివేషన్లతో కట్టి పారేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. హీరో, ప్రొడ్యూసర్ ఇద్దరూ అదే మాట అంటున్నారు.

ఇది సక్సెస్ కావడం రవితేజకు చాలా కీలకం. ధమాకా సోలో బ్లాక్ బస్టర్ తర్వాత రెండు ఫ్లాపులు వచ్చాయి. రావణాసుర కాన్సెప్ట్ ఫెయిల్ కాగా, టైగర్ నాగేశ్వరరావుకు ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. అందుకే ఈగల్ ఆ గాయాలను తుడిచేస్తుందనే నమ్మకం యూనిట్ లో కనిపిస్తోంది. అయితే ఇంగ్లీష్ టైటిల్ మాస్ కి తొందరగా రీచ్ కావడం లేదు. కంటెంట్ బాగుంటే ఇదేమీ పెద్ద సమస్య కాదు. స్టైల్, యాక్షన్, కమర్షియాలిటీ ఈ మూడింటిని కార్తీక్ ఎలా బ్యాలన్స్ చేశాడనే దాని మీద మెప్పించడం ఆధారపడి ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు.