మహేష్ అభిమానుల్లో టెన్షన్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కల నెరవేరబోతోంది. మహేష్ తన కెరీర్లోనే అతి పెద్ద ప్రాజెక్టుకు రెడీ అవుతున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి చర్చల్లో ఉన్న రాజమౌళి సినిమా ఈ ఏడాదే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ సినిమా కోసం ఆల్రెడీ మహేష్ ప్రిపరేషన్ కూడా మొదలైపోయింది. ఇటీవలే యూరప్ వెళ్లి ఒక ఫిట్నెస్ వర్క్ షాప్ లాంటిది చేసి వచ్చాడు మహేష్. ఈ సినిమాకు కథ ఆల్రెడీ రెడీ అయిపోగా.. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్లను ఖరారు చేసే పనిలో ఉన్నారు రాజమౌళి అండ్ కో. ఐతే ఎన్నో ఏళ్లుగా రాజమౌళితో పని చేస్తున్న ప్రముఖ టెక్నీషియన్లు ఒక్కొక్కరుగా ఈ సినిమాకు దూరం అవుతుండటం మహేష్ అభిమానులను కొంచెం టెన్షన్ పెడుతోంది.

ఆల్రెడీ కెమెరామన్ సెంథిల్ కుమార్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు దూరమయ్యాడు. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో సెంథిల్ కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజమౌళి విజన్‌కు తగ్గట్లుగా అత్యద్భుతంగా విజువల్స్ అందిస్తాడు సెంథిల్. పి.ఎస్.వినోద్ కూడా మంచి సినిమాటోగ్రాఫరే అయినా.. సెంథిల్ స్థాయిలో ఔట్ పుట్ ఇవ్వగలడా అన్న సందేహాలున్నాయి. మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా శ్రీనివాస్ మోహన్ స్థానంలోకి కమల్ కణ్ణన్ వచ్చాడంటున్నారు. ఆయన ఆల్రెడీ రాజమౌళి సినిమాలకు పని చేశాడు కాబట్టి ఓకే. కెమెరామన్, వీఎఫెక్స్ సూపర్ వైజర్‌ల సంగతిలా ఉంటే.. లేటెస్ట్‌గా ప్రొడక్సన్ డిజైనర్ కూడా మారినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇండియాలో నంబర్ వన్ ఆర్ట్ డైరెక్టర్ అనదగ్గ సాబు సిరిల్ స్థానంలోకి మోహన్ అనే టెక్నీషియన్ వచ్చాడట. అతను ‘ఆకాశవాణి’ అనే చిన్న సినిమాకు పని చేశాడు. సాబు అంటే అన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. ఆయన రేంజే వేరు. అలాంటి టెక్నీషియన్ స్థానంలోకి ఓ చిన్న సినిమాకు పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ రావడంతో ఈ సినిమా ఔట్ పుట్ ఎలా ఉంటుందో అని మహేష్ అభిమానులకు డౌట్లు కొట్టేస్తున్నాయి. ఈ మార్పులు కొంత ఆందోళన రేకెత్తించేవే అయినా.. ఎలాంటి టెక్నీషియన్ నుంచైనా తనకు కావాల్సిన బెస్ట్ ఔట్ పుట్ రాబట్టుకోగల సామర్థ్యం జక్కన్నకు ఉంది కాబట్టి టెన్షన్ అవసరం లేని చిత్ర వర్గాలు అంటున్నాయి.