టీవీలో వచ్చిన సినిమాకు థియేటర్ రిలీజ్

అదేంటో ప్రేక్షకులను అమాయకులుగా లెక్క కడతారో లేక బయ్యర్లు ఉన్నారనే ధీమానో తెలియదు కానీ టీవీలో వచ్చిన సినిమాను పేరు మార్చి మళ్ళీ థియేటర్ రిలీజ్ కు రెడీ చేయడం పెద్ద విచిత్రం. అది కూడా అయిదేళ్ల తర్వాత. 2019లో జ్యోతిక ప్రధాన పాత్రలో తమిళంలో రాచ్చసి విడుదలయ్యింది. విద్యా వ్యవస్థలో లోపాలను, వాటిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ దర్శకుడు సయ్యద్ గౌతమ్ రాజ్ తెరకెక్కించారు. ఒరిజినల్ వెర్షన్ బాగా ఆడింది. తెలుగులో ‘రాక్షసి’ పేరుతో డబ్బింగ్ చేశారు. హాళ్లలో వచ్చిందో లేదో గుర్తులేనంత వేగంగా కనుమరుగయ్యింది.

తర్వాత పలు మార్లు జీ5కు చెందిన శాటిలైట్ ఛానల్స్ లో టెలికాస్ట్ అయ్యింది. రాక్షసి పేరుతోనే ప్రసారం చేస్తూ వచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు దీన్ని ‘అమ్మ ఒడి’గా టైటిల్ మార్చి త్వరలో రిలీజ్ చేయబోతున్నామని హక్కులు కొన్న ప్రొడ్యూసర్లు ప్రకటించడం చూసి విస్తుపోవడం కన్నా చేసేదేముంది. అయినా ఎన్నికల టైం వస్తోందని, ఏపీలోని అధికార పార్టీ అమలు పరుస్తున్న ఒక పధకం పేరుని తీసుకొచ్చి ఇలా పెట్టేస్తే జనం టికెట్లు కొంటారా. ఇంత కన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు. పోనీ రీ రిలీజ్ అని ట్యాగ్ పెడితే ఏదో అనుకోవచ్చు. డైరెక్ట్ అన్నంత బిల్డప్ జరుగుతోంది.

ఎంత మంచి సినిమా అయినా కావొచ్చు మరీ ఇలా ఏమార్చాలని చూడటం మాత్రం వింతల్లో వింత. సోలోగా జ్యోతికకి ఇక్కడ మార్కెట్ ఏమి లేదు. ఆమె ప్రధాన పాత్రలో నటించినవి అధిక శాతం డైరెక్ట్ ఓటిటిలో వచ్చినవే. థియేటర్ లో వర్కౌట్ కావని తెలిసి డిజిటల్ కు ఇచ్చేశారు. అలాంటిది ఇప్పుడీ అమ్మ ఒడిని మార్కెటింగ్ చేయడం చూసి నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. హిందీ డబ్బింగ్ ని యూట్యూబ్ లో ‘మేడం గీతారాణి’ పేరుతో మూడేళ్ళ క్రితం అప్లోడ్ చేసితే ఇప్పటిదాకా అక్షరాలా 360 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బహుశా ఈ రెస్పాన్స్ చూశాకే ధైర్యం వచ్చిందేమో.