టికెట్ రేట్ల విషయంలో ఈగల్ తెలివైన నిర్ణయం

మాస్ మహారాజా రవితేజ ఈగల్ టికెట్ రేట్ల విషయంలో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మంచి నిర్ణయం తీసుకున్నారు. జిఓలో వెసులుబాటు ఉందనే సాకుతో మొదటి వారమే వీలైనంత రాబట్టుకునే ట్రెండ్ కి భిన్నంగా రెగ్యులర్ ప్రైజ్ తో వెళ్లాలని డిసైడ్ చేయడం సానుకూల ఫలితం ఇచ్చేలా కనిపిస్తోంది. తెలంగాణలో మల్టీప్లెక్స్ 200, సింగల్ స్క్రీన్ 150 రూపాయలకు పరిమితం చేయడం ద్వారా ఎక్కువ సామాన్యులు చూసే వెసులుబాటు కలుగుతుంది. గరిష్ట పరిమితి 295 పెట్టే ఛాన్స్ ఉన్నా దాని జోలికి వెళ్ళకపోవడం ఫుట్ ఫాల్స్ ని పెంచుతుంది. ఓపెనింగ్స్ బాగా వస్తాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలను మొదటి రోజే థియేటర్లకు వచ్చేలా చేయడం పెద్ద ఛాలెంజ్. రవితేజ రేంజ్ స్టార్ హీరోకు ఇది టెన్షన్ పడాల్సిన విషయం కాకపోయినా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఫలితాల ప్రభావం ఈగల్ మీద ఉంది. అందుకే మంచి కంటెంట్ ని చేరువ చేయాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. టికెట్ కు 95 రూపాయలు వదులుకోవడం కొంచెం రిస్క్ గా అనిపించినా పది మంది వచ్చే స్థానంలో పాతిక మందిని టికెట్లు కొనేలా చేయడం ద్వారానే ఎక్కువ లాభాలు వస్తాయి. సంక్రాంతికి టికెట్ హైక్ అడగకుండానే హనుమాన్ బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది.

పరీక్షల సీజన్ దగ్గరగా ఉండటం వల్ల సాధారణంగా ఫిబ్రవరి కొంచెం డ్రైగానే ఉంటుంది. అందుకే ఈగల్ నిర్మాతలు కంటెంట్ మీద ఎంత నమ్మకంతో ఉన్నా టికెట్ ధరల గురించి తెలివైన ఎత్తుగడ వేసుకున్నారు. కార్తీక ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కమర్షియల్ అంశాల పాటు రైతులకు సంబంధించిన ఓ కీలక సమస్యకు కొత్త తరహా ట్రీట్ మెంట్ ఉంటుందనే టాక్ ఇప్పటికే ఉంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లు కాగా నవదీప్, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులు ఇతర క్యాస్టింగ్. పోటీలో యాత్ర 2, లాల్ సలామ్, ట్రూ లవర్ లున్నాయి.