రెహమాన్ సాహసం భవిష్యత్తులో సమస్యే

సంగీత ప్రపంచంలో ఎవరూ చేయని ఒక సరికొత్త ప్రయోగానికి ఏఆర్ రెహమాన్ శ్రీకారం చుట్టడం సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. గతంలో ఆయన కంపోజింగ్ లో పాడి ఇతరత్రా కారణాల వల్ల కాలం చేసిన సాహుల్ హమీద్, బంబా బక్యా గొంతులను ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ వాడి పునః సృష్టించి లాల్ సలామ్ సినిమా కోసం వాడుకున్నారు. దీని కోసం సదరు కుటుంబ సభ్యుల వద్ద అనుమతి తీసుకుని, తగిన పారితోషికం ముట్టజెప్పి మరీ ఈ ఎక్స్ పరిమెంట్ చేశారు. గతంలో వాళ్లిద్దరూ ఎన్నో సూపర్ హిట్ ట్రాక్స్ లో రెహమాన్ తో పాలు పంచుకున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉంది.

భవిష్యత్తులో ఇదే తరహాలో ఎస్పి బాలసుబ్రమణ్యం గారి గాత్రాన్ని కూడా విన్పించేలా చేయాలని ఉందని రెహమాన్ మనసులో మాటను వెలిబుచ్చడం మ్యూజిక్ లవర్స్ లో ఆందోళన రేకెత్తిస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే ఇలా స్వర్గస్తులైన గాయకుల గాత్రాలను ఆర్టిఫీషియల్ గా పుట్టిస్తూ పోతే వర్ధమాన సింగర్స్ కు అవకాశాలు ఎలా వస్తాయి. ఫ్యూచర్ జెనరేషన్ లో పిల్లలు ఏవి ఒరిజినలో ఏవి ఏఐ ద్వారా కంపోజ్ చేసినవో కనిపెట్టలేక ఒరిజినాలిటీకి దూరం కావొచ్చు. చూస్తుంటే ఘంటసాల, మహామ్మద్ రఫీ లాంటి లెజెండ్స్ ని కూడా ఈ రూపంలో పుట్టిస్తే ఊహించని షాకే అవుతుంది.

ప్రస్తుతానికి దీని గురించి మిశ్రమాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెహమాన్ ఈ ప్రయోగాన్ని ఇక్కడితో ఆపేసి కొత్త సింగర్స్ కు ఛాన్స్ ఇవ్వాలని కొందరు అంటుండగా, ఎలాగైనా సరే కీర్తిశేషులైన గొప్ప గాయనీ గాయకులను ఈ విధంగా అయినా వినే అదృష్టం దక్కుతుందని మరికొందరు అంటున్నారు. లాల్ సలామ్ కంటెంట్ కంటే ఇప్పుడీ పాటల గురించిన చర్చే ఎక్కువగా జరుగుతూ ఉండటం విశేషం. పాతిక సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం పూర్తి చేసుకున్న ఏఆర్ రెహమాన్ తెలుగులో సినిమాలు తగ్గించినా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.