వేశ్యావాటిక మీద 14 ఏళ్ళ పరిశోధన

బాలీవుడ్ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీది ప్రత్యేకమైన శైలి. గ్రాఫిక్స్ అతి తక్కువగా వాడినా అంతకు మించి గ్రాండియర్ ని తన పాత్రలు, సెట్లు, ఆరిస్టుల ద్వారా తీసుకురావడం ఆయన స్టైల్. దేవదాస్, పద్మావత్, గంగూబాయ్ కటియావాడి ఇలా ఏది తీసుకున్నా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి భన్సాలీ ‘హీరామండి ది డైమండ్ బజార్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఇది సినిమా కాదు. వెబ్ సిరీస్. అదితిరావు హైదరి, సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, రిచా చద్దా, షర్మిన్ ప్రధాన పాత్రలు పోషించగా టీజర్ షాట్స్ చూస్తే అంచనాలు ఓ రేంజ్ లో పెరిగేలా ఉన్నాయి .

హీరామండి అంటే వేశ్యావాటిక. పాకిస్థాన్ దేశం లాహోర్ నగరంలో పేరొందిన ప్రాంతం. వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన ఏరియాలోకి ఒళ్ళమ్ముకునే వ్యాపారం ఎలా జరిగిందనే దాని మీద బోలెడు చరిత్ర ఉంది. పదహారో శతాబ్దం తర్వాత అహ్మద్ షా అబ్దాలో హయాంలో అమ్మాయిలను ఎత్తుకొచ్చి పడుపు వృత్తిలోకి దింపేవారు. క్రమంగా ఇది పైసల నుంచి లక్షల్లోకి జరిగే వ్యాపారంగా ఎదిగింది. ప్రభుత్వాలను సైతం శాశించే స్థాయిలో వీటిని నడిపే బ్రోకర్లు ఆధిపత్యం చెలాయించేవారు. భన్సాలీ ఈ హిస్టరీని తిరగతోడి దానికి తన క్రియేటివిటీని జోడించి హీరామండిని రూపొందించారు.

విజువల్స్ చూస్తే హీరామండి ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా తీర్చిదిద్దారు. విడుదల తేదీ ఇంకా రివీల్ చేయలేదు కానీ మార్చి నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ముంబై రిపోర్ట్. పధ్నాలుగు సంవత్సరాలు పరిశోధనకే కేటాయించారంటే వర్క్ ఏ రేంజ్ లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు వేశ్యల చుట్టు తిరిగే కథగా హీరామండి కథ సాగుతుంది. బ్యాక్ గ్రౌండ్ మొత్తం భారతదేశానికి స్వతంత్రం రాక ముందు, పాకిస్థాన్ విడిపోక ముందు జరిగే సంఘటనల ఆధారంగా రూపొందింది. ఓటిటి చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ సిరీస్ గా దీన్ని చెప్పుకుంటున్నారు