ఓటీటీ రిలీజే.. కానీ ఫ్రీ కాదు

అన్నేసి కోట్లు పెట్టి కొత్త సినిమాలను కొని రిలీజ్ చేస్తున్న ఓటీటీలకు ఆ మొత్తం రికవరీ ఎలా? చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ యాడ్ చేయడం ఓటీటీల ప్రథమ కర్తవ్యం. అప్పటికే సబ్‌స్క్రిప్షన్లు తీసుకున్న వాళ్లను ఎంగేజ్ చేస్తూ, వాళ్లు డ్రాప్ కాకుండా ఉండాలంటే కొత్త కంటెంట్ ఇస్తూ ఉండాలి. అలాగే కొత్త సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడానికీ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ చేస్తూ ఉండాలి.

అయినా సరే.. చివరికి చూస్తే ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత రాబడి వచ్చింది అన్నది కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో భారీ రేటు పెట్టి కొత్త సినిమాలను కొంటున్న ఓటీటీలు.. పే పర్ వ్యూ పద్ధతిని ప్రవేశ పెడితే ఎలా ఉంటుందనే చర్చ కొంత కాలంగా నడుస్తోంది. ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ సొంతంగా ఒక ఫ్లాట్ ఫామ్ పెట్టుకుని బయట థియేటర్లలో సినిమా చూసేందుకు పెట్టినట్లే టికెట్ రేటు పెట్టి కొన్ని చిత్రాలను విడుదల చేసి సొమ్ము చేసుకున్న సంగతి తెలిసిందే.

వర్మ తీసిన నాసిరకం సినిమాలకు కూడా ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో అంచనాలకు మించి రాబడి వచ్చింది. ఇదే విధానాన్ని ఓటీటీలు కూడా అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపించింది. ఆల్రెడీ ఓటీటీలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయని.. సబ్‌స్క్రిప్షన్ల కోసం ఆల్రెడీ డబ్బులు చెల్లించారు కాబట్టి కొత్త సినిమాలకు తక్కువ రేటుతో టికెట్ పెట్టడం మంచి ఆలోచనే అవుతుందనుకుంటున్నాయని వార్తలొచ్చాయి. ఈ దిశగా జీ5 ముందడుగు వేసింది.

యంగ్ హీరో హీరోయిన్లు ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే జంటగా మక్బూల్ ఖాన్ రూపొందించిన ‘ఖాలి పీలి’ అక్టోబరు 2న జీ5లో విడుదల కాబోతోంది. ఓటీటీల్లో తొలిసారి పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజవుతున్న చిత్రమిది. టికెట్ రేటు ఎంత అన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఐతే ఇలాంటి ప్రయోగం చేస్తున్నపుడు ఒక భారీ, క్రేజీ చిత్రంతో మొదలుపెడితే బాగుండేదేమో.

‘ఖాలి పీలి’ ఏమీ అంత క్రేజున్న చిత్రం కాదు. పైగా నెపోటిజం బ్యాచ్‌లో ఒకరిగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అనన్య పట్ల ప్రేక్షకుల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఈ చిత్రానికి ‘సడక్-2’ తరహాలో చేదు అనుభవం తప్పదేమో అనిపిస్తోంది కూడా. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.