ప్రశాంత్ వర్మ.. నిజంగా ఆ సినిమా చేస్తాడా?

ప్రశాంత్ వర్మ.. రెండు వారాలుగా దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాలు రిలీజయ్యే అన్ని చోట్లా చర్చనీయాంశం అవుతున్న పేరు. హనుమాన్ సినిమాతో అతను సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక అప్ కమింగ్ హీరోను పెట్టి పరిమిత బడ్జెట్లో అతను తీసిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్.. అమెరికా సహా పలు దేశాల్లో భారీ వసూళ్లు రాబడుతోంది. మూడో వారంలో కూడా స్ట్రాంగ్‌గా నిలబడింది. హనుమాన్‌కు కొనసాగింపుగా ‘జై హనుమాన్’ను ఇంకా భారీ స్థాయిలో తీస్తానని.. ఆ చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతుందని ప్రశాంత్ ఇప్పటికే ప్రకటించాడు. ఐతే దాని కంటే ముందు అతడి చేతిలో రెండు సినిమాలున్నాయి.

అందులో ఒకటి ఆల్రెడీ అనౌన్స్ అయిన ‘అధీర’. ఇంకోటి.. మహంకాళి. ఈ మహంకాళి సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా ఏ విశేషం బయటికి రాలేదు. కానీ ‘అధీర’ అనౌన్స్ అయి చాలా కాలం అయింది. సీనియర్ నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ హీరోగా పరిచయం కావాల్సిన చిత్రమిది. ఐతే అనౌన్స్ అయ్యాక ఈ సినిమా ముందుకు కదల్లేదు. ప్రశాంత్ ఫోకస్ అంతా ‘హనుమాన్’ మీదే నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రం రిలీజై బ్లాక్‌బస్టర్ అయింది. తన చేతిలో ఉన్న రెండు సినిమాల గురించి మీడియా ఇంటర్వ్యూల్లో ప్రస్తావిస్తూనే.. ‘జై హనుమాన్’ పనులు మొదలుపెట్టేశాడు ప్రశాంత్.

‘జై హనుమాన్’ తీస్తూ ‘అధీర’ మీద అతను ఫోకస్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఇప్పటికే ప్రశాంత్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న కళ్యాణ్ పరిస్థితేంటో చూాడాలి. నిజానికి ప్రస్తుతం ప్రేక్షకులు తన నుంచి కోరుకున్న చిత్రం జై హనుమానే. ఇది ఒక స్టార్ హీరోతో పెద్ద బడ్జెట్లో తీయాల్సిన సినిమా. ఎక్కువ ఆలస్యం చేయకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అది కూడా రిలీజై ‘హనుమాన్’ లాగే ఆడేస్తే ప్రశాంత్ వర్మ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. అతడి కోసం పెద్ద బేనర్లు, స్టార్ హీరోలు లైన్లో నిలబడతారనడంలో సందేహం లేదు. ఆ పరిస్థితుల్లో అధీర సంగతి ఏమవుతుందో? దీన్ని తన పర్యవేక్షణలో తన టీంలో ఒకరితో తీయించాలని ప్రశాంత్ చూస్తున్నాడట.