పరుగులు పెడుతున్న విశ్వంభర వ్యవహారాలు

ఇంకా చిరంజీవి సెట్లోకి అడిగి పెట్టకుండానే విశ్వంభరకు సంబంధించిన ఇతర వ్యవహారాలు జరిగిపోతున్నాయి. ఓవర్సీస్ హక్కులు 18 కోట్లకు అమ్ముడుపోయినట్టు గత రెండు రోజులుగా వార్త తిరుగుతూనే ఉంది. డిస్ట్రిబ్యూటర్ ఎవరో కన్ఫర్మ్ అయినా ఎంత మొత్తానికి అనేది అధికారికంగా బయటికి చెప్పరు కాబట్టి ప్రస్తుతానికి నిప్పు లేనిదే పొగరాదు తరహాలో ఈ ఫిగర్ నే పరిగణనలోకి తీసుకోవాలి. ఇక విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ కూడా చక్కర్లు కొడుతోంది. 2025 జనవరి 10 రిలీజ్ డేట్ లాక్ చేసుకుని దానికి అనుగుణంగా యువి సంస్థ ప్లాన్ చేసుకుంటోందని సమాచారం.

దీని వెనుక మంచి స్ట్రాటజీ ఉంది. పదో తేదీ శుక్రవారంతో మొదలుపెట్టి పదిహేను కనుమ పండగ దాకా వరసగా సెలవులు వచ్చేస్తాయి. పైగా సంక్రాంతి రేసులో అందరికంటే ముందు వచ్చే అడ్వాంటేజ్ ఎలాగూ ఎక్కువ థియేటర్లు వచ్చేలా చేస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆకాశమే హద్దుగా చెలరేగిపోవచ్చు. విపరీతమైన ఒత్తిడి మధ్య హనుమాన్ ఈ స్థాయి అరాచకం చేసినప్పుడు ఇక చిరంజీవి లాంటి స్టార్ ఉంటే ఏం జరుగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటిదాకా జరిగిన షూటింగ్ లో కేవలం ఇతర ఆర్టిస్టులు మాత్రమే ఉన్నారు. చిరు ఎంట్రీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఉంటుంది.

సుమారు పదమూడు పైగా సెట్లు వేస్తున్నారు. బడ్జెట్ లో అధిక శాతం వీటికే వెళ్తోందని టాక్. తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ కి ఇంతకు మించి ఖర్చు పెట్టబోతున్నారు. మొత్తం ప్రొడక్షన్ కలిపి రెండు వందల కోట్ల దాకా అవుతుందని భోగట్టా. యువి క్రియేషన్స్ కి ఇదేమి భారం కాదు కానీ సక్సెస్ అయితే అంతకంతా సులభంగా వెనక్కు వచ్చేస్తుంది. బింబిసార తర్వాత దర్శకుడు వశిష్టకు వచ్చిన మెగా ఆఫర్ కావడంతో ఇంకా బలంగా ఋజువు చేసుకోవడానికి ఇంత కన్నా మంచి ఛాన్స్ దొరకదు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. త్రిషతో పాటు మిగిలిన హీరోయిన్లని ఇంకా ప్రకటించలేదు.