సూర్య సరసన దేవర హీరోయిన్

దేవర ఇంకా విడుదల కాకుండానే జాన్వీ కపూర్ కు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా సూర్య సరసన భారీ ఇతిహాసంలో ఛాన్స్ దక్కించుకున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. మహాభారతం ఆధారంగా దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ తీయబోయే ప్యాన్ ఇండియా మూవీలో కర్ణుడికి జోడిగా ఆమెను ఎంచుకున్నట్టు తెలిసింది. నిజానికి సీరియళ్లు, సినిమాల్లో కవచకుండల ధారికి భార్యలు ఉన్నట్టు చూపించరు. కానీ చరిత్రలో వృషాలి, సుప్రియ పేరుతో ఆయన జీవితాన్ని పంచుకున్నారని పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తీసిన దానవీరశూరకర్ణలో సైతం వీళ్ళ ప్రస్తావన కనిపించదు.

ఇప్పుడు ఓంప్రకాష్ తీయబోయే ఎపిక్ లో మాత్రం చూపిస్తారట. ఒకరు జాన్వీ కపూరని వినికిడి. ఎస్ చెప్పడం అయిపోయిందని, రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది వేసవిలో ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టు సమాచారం. ఇదే కథతో గతంలో విక్రమ్ తో వేరే దర్శకుడి కాంబోలో మొదలుపెట్టారు. కానీ కొంత భాగం షూట్ జరిగాక అర్ధాంతరంగా ఆగిపోయింది. తిరిగి మొదలుపెట్టాలని ట్రై చేశారు కానీ చియాన్ దాని మీద ఆసక్తి తగ్గిపోయి వదిలేశారు. ఫైనల్ గా ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ తో సూర్యకు కుదురుతోంది.

హిందీలో ఎన్ని సినిమాలు చేస్తున్న స్టార్ డం అందని ద్రాక్షగా మారిన జాన్వీ కపూర్ సౌత్ లో మెల్లగా సెటిలయ్యేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఇక్కడ ఎలాగూ హీరోయిన్ల కొరత తీవ్రంగా ఉంది. శ్రీలీల లాంటి ఒకరిద్దరు తప్ప స్టార్ హీరోలకు పెద్దగా ఆప్షన్లు లేకుండా పోయాయి. ఆ అమ్మయి కూడా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోంది. ఇలాంటి టైంలో జాన్వీ కనక ఓ బ్లాక్ బస్టర్ అందుకుంటే ఖచ్చితంగా అవకాశాలు క్యూ కడతాయి. దేవర షూటింగ్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో తన మొదటి రిలీజ్ కోసం వేచి చూడక తప్పేలా లేదు. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో మంచి డేట్ కోసం చూస్తున్నారు.