‘పద్మవిభూషణ్’ చిరంజీవి – తెలుగు సినిమా గర్విస్తోంది

టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. భారతదేశపు అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త వారం క్రితమే వచ్చినప్పటికీ ధృవీకరణ అయ్యే దాకా వేచి ఉండే ఉద్దేశంతో మీడియా, అభిమానూలు సంయమనం పాటించారు. ఎట్టకేలకు ఫ్యాన్స్ కల నెరవేరింది. మొత్తం అయిదుగురికి ఈ బిరుదు ప్రకటించారు. వారిలో చిరంజీవి కాకుండా వైజయంతి మాల, వెంకయ్య నాయుడు, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యం ఉన్నారు. పద్మశ్రీ గౌరవం మరో పదిహేడు మందికి అందించబోతున్నారు.

చిరంజీవికి దక్కిన పద్మభూషణ్ వెనుక ఎన్నో విశేషాలున్నాయి. తెలుగు చలన చిత్ర చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు (2011) తర్వాత ఈ ఘనత దక్కించుకున్న నటుడు ఈయనే. దక్షిణాది పరిశ్రమ మొత్తాన్ని తీసుకుంటే 2016లో సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రమే అందుకున్నారు. 1954లో మొదలైన పద్మభూషణ్ బిరుదుని ఇప్పటిదాకా కళలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే కేవలం 64 విశిష్ట వ్యక్తులకు అందజేశారు. వారిలో సినిమా రంగానికి చెందిన నటులు కేవలం ఆరుగురు. పైన చెప్పిన ఇద్దరు కాకుండా మిగిలినవారు వి శాంతారాం, జోరా సెహగల్, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్. వీళ్ళ సరసన చిరంజీవి చేరారు. అన్ని రంగాలు కలిపి 325 ఉన్నారు.

ఇది నిజంగా గర్వించదగిన విషయం. కేవలం హీరోగానే కాకుండా సమాజానికి ఉపయోగపడే రక్తదానం, నేత్రదానం లాంటి ఎన్నో కార్యక్రమాలతో వేలాది ప్రాణాలకు ఊపిరి పోసిన చిరంజీవి సేవా గుణాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. అరవై ఏడేళ్ల వయసులో కూడా విశ్రాంతి లేకుండా నటిస్తూనే ఉన్న మెగాస్టార్ కోట్లాది అభిమానుల స్వప్నాన్ని నెరవేర్చారు. 2006లో పద్మశ్రీ అందుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్ తో పాటు ఎందరో అతిరధ మహారధులు హాజరు కాగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అంతకన్నా గొప్పదైన పద్మవిభీషణుడిగా మారిన చిరు ఆనందాన్ని మాటల్లో కొలవడం కష్టమే.