హునుమాన్ డైరెక్టర్.. పెద్ద స్టేట్మెంటే

అ!, కల్కి, జాంబిరెడ్డి.. ఇలా వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు ప్రశాంత్ వర్మ. ఐతే తొలి మూడు చిత్రాలు కమర్షియల్‌గా మరీ పెద్ద సక్సెస్ కాకపోయినా.. ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ ఏమాత్రం తగ్గలేదు.

ఎప్పుడు మీడియాతో మాట్లాడినా తన వ్యాఖ్యలు కొంచెం హెచ్చు స్థాయిలోనే ఉండేవి. ప్రపంచ స్థాయి సినిమాలు తీస్తాననే అనేవాడు. ఆ కామెంట్లు అప్పట్లో అతిగా అనిపించి అతణ్ని సోషల్ మీడియా జనాలు ట్రోల్ చేసేవాళ్లు కూడా. కానీ హనుమాన్ సినిమా తర్వాత ఈ ట్రోలింగ్ అంతా ఆగిపోయింది. ఈసారి మాటలకు పరిమితం కాకుండా చేతల్లోనూ ప్రపంచ స్థాయి సినిమాను చూపించాడు. పరిమిత బడ్జెట్లో హనుమాన్ సినిమాలో అతను చూపించిన పనితనం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ వంద రెట్లు భారీగా ఉంటుందని అతను బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు.

అంతటితో ఆగకుండా తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. సంక్రాంతి టైంలో సినిమాల రిలీజ్, థియేటర్ల గురించి మన నిర్మాతలు కలిసి మాట్లాడుకున్నట్లే.. ఇండియన్ సినిమాల గురించి హాలీవుడ్ వాళ్లు మాట్లాడుకునేలా చేస్తానని.. ఆ స్థాయిలో సినిమాలు తీస్తానని, ఇండియన్ సినిమా స్థాయిని పెంచాలనుకుంటున్నానని అతను అన్నాడు. మరోవైపు రామాయణం, మహాభారతం మీద సినిమాలు తీయడం గురించి మాట్లాడుతూ.. రాజమౌళి చేస్తానన్నాడు కాబట్టే మహాభారతం తీయట్లేదని.. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి తీయకపోతే తాను రామాయణం తీస్తానని ప్రశాంత్ చెప్పాడు.

హనుమాన్ చిత్రంలో విభీషణుడి పాత్రను కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టితో చేయించాలనుకున్నానని.. కానీ ఆయన డేట్లు లేకపోవడంతో సముద్రఖనితో ఆ క్యారెక్టర్ చేయించానని.. భవిష్యత్తులో తన సినిమాటిక్ యూనివర్శ్‌లో నటిస్తానని రిషబ్ హామీ ఇచ్చాడని ప్రశాంత్ వెల్లడించాడు.