అభిమానులూ… కాస్త ఆలోచించండి

ఆర్ఆర్ఆర్ వచ్చి రెండేళ్లు దాటేస్తోంది. అయినా సరే అభిమానులకు ఎప్పుడైనా ఏదైనా ఆన్ లైన్ వివాదం కావాలంటే ఆ సినిమానే ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇటీవలే పలు ఇంటర్వ్యూలలో రచయిత విజయేంద్ర ప్రసాద్ ట్రిపులర్ లో, తారక్ చరణ్ పాత్రల ప్రాధాన్యం గురించి చేసిన కామెంట్లు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. చరణ్ మెయిన్ హీరో అన్నాడని ఒకరు, జూనియర్ ఎన్టీఆర్ తప్ప భీమ్ గా ఎవరు చేయలేరని చెప్పాడని మరొకరు ఇలా రెండు వర్గాలుగా విడిపోయి మధ్యలో పెద్దాయన్ని టార్గెట్ గా మార్చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏదైనా వ్యవహారం చాలా దూరం వెళ్తోంది.

ఆర్ఆర్ఆర్ అనేది జరిగిపోయిన కథ. ఎక్కువ తక్కువల గురించి ఇప్పుడు చర్చ అనవసరం. నాటు నాటు పాట ఇంటర్నేషనల్ లెవెల్ లో రీచ్ తెచ్చుకోవడానికి కారణం కేవలం కీరవాణి ట్యూన్ కాదు. లయబద్ధంగా ఒకే రీతిలో తారక్ చరణ్ వేసిన అదిరిపోయే స్టెప్పుల వల్ల. వాళ్ళ మధ్య వ్యక్తిగత స్నేహం బలంగా ఉండటం వల్లే అదంత గొప్ప పేరు సాధించింది. దాని కోసం ఎంత హోమ్ వర్క్ చేశారో మేకింగ్ వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. బ్రిడ్జ్ మీద చేతులు కలిపే ఎపిసోడ్ కోసం ఎన్ని గంటలు గాల్లో వేలాడారో ఈ మధ్య హనుమాన్ హీరో తేజ సజ్జ ఒక ఇంటర్వ్యూలో వివరించడం షాక్ ఇచ్చింది.

ఇదంతా మర్చిపోయి కేవలం గొప్పలు చెప్పుకోవడం కోసం సోషల్ మీడియా ఫ్యాన్స్ పరస్పరం బురద జల్లుకోవడం విచారకరం. పైగా పదే పదే విజయేంద్ర ప్రసాద్ గారిని లాగడం కరెక్ట్ కాదు. వాళ్లంతా బాగున్నారు. మహేష్ బాబు మూవీ అయ్యాక ఆర్ఆర్ఆర్ 2 అంటే మళ్ళీ కలుస్తారు. ఒకళ్ళ ఫంక్షన్ లకు మరొకరు మిస్ కాకుండా వెళ్తారు. గ్రౌండ్ లెవెల్ లో అభిమానులు మాత్రం ఇలా ఆన్ లైన్ ట్రోల్స్ చేసుకోవడం అచ్చం కామెడీ సినిమాలా ఉంది. పెద్దాయన ఉద్దేశాలను పక్కదారి పట్టించడం సరికాదు. కాస్త అలోచించి ఇలా చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదని గుర్తిస్తే మంచిది.