స్టార్ హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితి ఏంటో

బాలీవుడ్ లో అజయ్ దేవగన్ చిన్న స్టార్ కాదు. సరైన బ్లాక్ బస్టర్ పడితే ఈజీగా రెండు వందల కోట్లు రాబట్టే మార్కెట్ ఉంది. అలాంటిది తన సినిమా మైదాన్ ఏళ్ళ తరబడి ల్యాబులోనే మగ్గిపోవడం చిత్రాతి చిత్రం. అలా అని ఎవరో ఆషామాషీ నిర్మాత తీస్తే ఏదో అనుకోవచ్చు. హిందీ నుంచి తమిళం దాకా వందల కోట్ల ప్రాజెక్టులను డీల్ చేస్తున్న బోనీ కపూర్ ప్రొడ్యూసర్. ఎప్పుడో 2020లో రిలీజ్ చేయాలని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత నాలుగైదు డేట్లు మారాయి. ఒకదశలో ఆర్ఆర్ఆర్ కు పోటీగా 2022 మార్చి అనుకున్నారు. కానీ సాధ్యపడలేదు. గత ఏడాది ట్రై చేసినా లాభం లేకపోయింది.

నిర్మాణ దశలో సెట్లకు డ్యామేజ్ జరగడం, ఒరిజినల్ ఫీల్ కలగడం కోసం నిజమైన గ్రౌండ్ ని కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తే సగం షూటింగ్ అవ్వకుండానే చెడిపోవడం లాంటి కారణాలు ఎప్పటికప్పుడు స్పీడ్ బ్రేకర్స్ గా మారాయి. దీంతో తర్వాత ఎలాగోలా పూర్తి చేసినా బోనీ కపూర్ కు ఆసక్తి తగ్గిపోయి దీన్ని పూర్తిగా పక్కనపెట్టాడు. కట్ చేస్తే ఇప్పుడు రాబోయే ఏప్రిల్ లో విడుదల చేసేందుకు పూనుకుంటున్నారట. 1951 నుంచి 1962 మధ్య ఇండియన్ ఫుట్ బాల్ కు యెనలేని సేవలు చేసిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవిత కథ ఆధారంగా దర్శకుడు అమిత్ శర్మ ఈ మైదాన్ ని రూపొందించారు.

సరే ఇప్పటికైనా మాట మీద ఉండి ఏప్రిల్ లో రిలీజ్ చేస్తారా అంటే వచ్చే దాకా నమ్మలేం అంటున్నారు బయ్యర్లు. ఆల్రెడీ దీని మీద ఆసక్తి సన్నగిల్లిందని, ఏదో మేజిక్ అనిపించే స్థాయిలో ప్రమోషన్లు చేస్తేనే ఓపెనింగ్స్ ఆశించవచ్చని అంటున్నారు. 2018లో బాదాయి హోతో హిట్టు కొట్టిన అమిత్ శర్మ తర్వాత దక్కిన పెద్ద సినిమా ఇదే. తీరా చూస్తే విడుదల ఆగిపోయి ఇంకో అవకాశం తలుపు తట్టలేదు.అయినా ఇమేజ్ లేని హీరోతో చేస్తేనో లేదా బడ్జెట్ కు డబ్బులు లేకనో ఆగిపోతే ఒక అర్థం ఉంది కానీ ఈ రెండు సమస్యలు లేని మైదాన్ ఇలా సంవత్సరాల తరబడి మగ్గిపోవడం నిజంగానే అనూహ్యం.