సుషాంత్‍ది సూసైడే.. కానీ రియా సేఫ్‍ కాదు!

సుషాంత్‍ సింగ్‍ రాజ్‍పుట్‍ ఆత్మహత్య చేసుకుని మరణించాడా లేక మర్డర్‍ చేసారా అనే కోణంలో సిబిఐ కొన్నాళ్లుగా దర్యాప్తు జరుపుతోంది. రియా చక్రవర్తితో పాటు చాలా మందిని విచారించింది. సుషాంత్‍ భయంకరమయిన మానసిక రుగ్మతతో పోరాడుతున్నాడని, అతడికి ఎప్పట్నుంచో మానసిక సంబంధిత సమస్యలున్నాయని సిబిఐ గుర్తించింది. అతడు అలా మారిపోవడానికి రియా కుట్ర చేసిందనే కోణంలోను సిబిఐ విచారణ జరిపినా కానీ ఆమె అలా చేసిందనే దానికి సిబిఐ ఎలాంటి అనుమానిత విషయాలు కనుగొనలేదని సమాచారం.

సుషాంత్‍ మరణంలో పాత్ర కానీ, అతని డబ్బులు దుర్వినియోగం చేసిందనే ఆరోపణల పరంగా కానీ సిబిఐకి రియా చక్రవర్తి దోషి అనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే ఈ గొడవలో రియాతో పాటు ఆమె సోదరుడు కూడా డ్రగ్స్ వినియోగం విషయంలో మాత్రం అడ్డంగా దొరికిపోయారు. వీరు వున్న వాట్సాప్‍ గ్రూపుల్లో చాట్స్, వీళ్ల పర్సనల్‍ చాట్స్ లో కూడా పలుమార్లు డ్రగ్స్ ప్రస్తావన వుండడంతో ఆ కేసు మాత్రం మెడకు చుట్టుకునేలా వుంది.

మరి ఈ ఛార్జస్‍ ఎంత తీవ్రంగా వుంటాయో, దీంట్లో రియాకు ఎన్నాళ్ల శిక్ష పడుతుందో తెలియదు కానీ సుషాంత్‍ అభిమానులు మాత్రం అతడిది ఆత్మహత్యే అనే వాదనను ఇప్పటికీ అంగీకరించడం లేదు.