నాగార్జున పరిచయం చేసిన 25 దర్శకులు ఎవరు

నిన్న జరిగిన నా సామిరంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఈ సినిమాతోనే డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాగార్జున ద్వారా పాతిక మంది దర్శకులు ఇండస్ట్రీలో లాంచ్ అయ్యారని చెప్పడం అభిమానుల్లోనే కాదు సగటు మూవీ లవర్స్ లోనూ ఆసక్తి రేపింది. ఎందుకంటే 25 చిన్న నెంబర్ కాదు. అలా అని అక్కడ చెప్పిందేమీ అబద్దమూ కాదు. హీరోగా, అన్నపూర్ణ స్టూడియోస్ – గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్మెంట్స్ తరఫున నిర్మాతగా అన్ని చిత్రాలకు కలిపి నిజంగానే అంత మంది టాలీవుడ్ కు వచ్చారు. ఆ వివరాలేంటో చూద్దాం.

ముందు హీరోగా చేసినవాటి సంగతికొస్తే వాళ్ళు గీతాకృష్ణ (సంకీర్తన), రాంగోపాల్ వర్మ (శివ), ఉప్పలపాటి నారాయణరావు(జైత్రయాత), ప్రవీణ్ గాంధీ(రక్షకుడు), ప్రతాప్ పోతన్ (చైతన్య), ఫాసిల్(కిల్లర్), రవిచంద్రన్(శాంతి క్రాంతి), రాజేంద్ర సింగ్ బాబు(ప్రేమ యుద్ధం), ప్రియదర్శన్(నిర్ణయం), జొన్నలగడ్డ శ్రీనివాసరావు(ఎదురు లేని మనిషి), ఆర్ఆర్ షిండే(నిన్నే ప్రేమిస్తా), విఆర్ ప్రతాప్(నువ్వు వస్తావని), దశరథ్ (సంతోషం), అర్జున్ సజ్నాని(అర్జున్ సజ్నాని), రాఘవేంద్ర లారెన్స్ (మాస్), కిరణ్ కుమార్(కేడి), కళ్యాణ్ కృష్ణ(సోగ్గాడే చిన్ని నాయనా), నాగ కోటేశ్వరరావు(నిర్మల కాన్వెంట్), అహిషోర్ సాల్మన్(వైల్డ్ డాగ్) ఉన్నారు.

ప్రొడ్యూసర్ గా వైవిఎస్ చౌదరి(శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి), సూర్యకిరణ్(సత్యం), విరించి వర్మ(ఉయ్యాలా జంపాల), శ్రీరంజని(రంగుల రాట్నం) ఈ లిస్టులో వస్తారు. ఇప్పుడు నా సామిరంగతో విజయ్ బిన్నీ ఎంట్రీ జరిగిపోయింది. ఇంత నెంబర్ లో డైరెక్టర్లను తీసుకొచ్చింది నాగార్జుననే చెప్పాలి. వీళ్ళలో పెద్ద స్థాయికి వెళ్ళినవాళ్ళు ఉన్నారు. సక్సెస్ ని నిలబెట్టుకోలేక త్వరగా కనుమరుగైన వాళ్ళు ఉన్నారు. కన్నడ, మలయాళం, తమిళ దర్శకులను తీసుకొచ్చి టాలీవుడ్ లో తెరంగేట్రం చేయించిన పేర్లు కూడా ఇందులోనే ఉన్నాయి. సీనియర్ హీరోల్లో ఇది చెప్పుకోదగ్గ క్రెడిట్టే.