గుంటూరు కారంపై ఇంకో మరక

ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది గుంటూరు కారం. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో అత్యధిక అంచనాలున్నది ఈ చిత్రం పైనే అన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గుంటూరు కారం రకరకాల కారణాలవల్ల ఎక్కువగా నెగిటివ్ విషయాలతోనే వార్తల్లో నిలిచింది. రిలీజ్ ముంగిట కూడా ఈ వార్తలు ఆగట్లేదు. ఈ సినిమా కథకు ఏంటి ఆధారం అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచన రాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా త్రివిక్రమ్ గుంటూరు కారం చిత్రాన్ని రూపొందించినట్లుగా ఇంతకుముందు వార్తలు వచ్చాయి. ఇంతకుముందు ఇదే రైటర్ రాసిన మీనా ఆధారంగా ఆయన అఆ సినిమా తీయడం, ఆమెకు క్రెడిట్ ఇవ్వకపోవడం మీద వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీర్తి కిరీటాలు ఆధారంగా గుంటూరు కారం రూపొందిన వార్త చర్చనీయాంశంగా మారింది.

ఈ డిస్కషన్ ఇలా నడుస్తుండగానే ఇప్పుడు గుంటూరు కారం కథ గురించి కొత్త వార్త తెరపైకి వచ్చింది. ఈ చిత్రం ఒక మలయాళం సినిమాకి రీమేక్ అని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. మలయాళం లో మమ్ముటి హీరో గా నటించిన ‘రాజమాణిక్యం’ అనే సినిమా కొన్నేళ్ల కిందట ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ‘గుంటూరు కారం’ ట్రైలర్ చూస్తే.. ఆ సినిమాతో పోలికలు కనిపించాయి. రాజమాణిక్యం సినిమాలో హీరో కొన్ని కారణాల వల్ల తన కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అతను అలా వెళ్లిపోవడానికి కారణం తన సవతి తల్లి కొడుకుని జైలు నుండి బయటకి తీసుకొని రావడం కోసం అని తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు జైలు నుండి బయటకి వచ్చిన హీరో తండ్రి ఆస్తి కోసం కొట్టుకుంటున్న అన్నదమ్ములను కలిపి కథని సుఖాంతం చేస్తాడు.

‘గుంటూరు కారం’లోనూ హీరో చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. తర్వాత తిరిగి వచ్చి ఆ కుటుంబంలోని సమస్యలన్నీ పరిష్కరించే తరహాలో హీరో కనిపిస్తున్నాడు. దీంతో రాజమాణిక్యం మూల కథను తీసుకొని త్రివిక్రమ్ దానికి తన టచ్ ఇచ్చాడేమో అన్న చర్చ జరుగుతోంది.