వాల్తేరు వీరయ్య.. ఇంకా ఆడుతోంది

పోయిన సంక్రాంతికి సందడి అంతా మెగాస్టార్ చిరంజీవిదే. ఆయన సినిమా వాల్తేరు వీరయ్య రీఎంట్రీ తర్వాత 2013 సంక్రాంతికి విడుదలై చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రం 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. అటు ఇటుగా 50 రోజుల పాటు వాల్తేరు వీరయ్య థియేట్రికల్ రన్ సాగింది. ఆ తర్వాత ఆ చిత్రం ఓటిటిలోకి వచ్చింది. శాటిలైట్లో కూడా ప్రసారం అయింది. అయినా సరే ఒక థియేటర్లో వాల్తేరు వీరయ్య ఇంకా ఆడుతున్నాడు విశేషం. పోయిన సంక్రాంతికి రిలీజ్ అయి ఈ సంక్రాంతికి కూడా ఆ సినిమా ఆ థియేటర్లోనే ఉంది. అవనిగడ్డ ప్రాంతంలోని రామకృష్ణ థియేటర్లో వాల్తేరు వీరయ్య 365 రోజుల రన్ పూర్తి చేసుకోవడం విశేషం.

ఈ సందర్భంగా మెగా అభిమానులు ఒక ప్రత్యేక వేడుక నిర్వహించి దర్శకుడు బాబి కొల్లి, నిర్మాత రవిశంకర్ లను సన్మానించడం విశేషం. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. వాల్తేరు వీరయ్య సినిమా అంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ, అలాగే తన తమ్ముడు రవితేజ, ఈ సినిమాకి ప్రతి అంశాన్ని పేర్చి చేర్చిన నిర్మాతలు అని.. వీరందరూ లేకపోతే వాల్తేరు వీరయ్య సినిమా లేదని చిరు అన్నారు.

ఈ రోజుల్లో కూడా ఈ సినిమా 365 రోజులు ఒక థియేటర్లో రన్ అవడం సాధారణ రికార్డు కాదని చెబుతూ.. అందరికీ కొత్త సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలను మెగాస్టార్ తెలియజేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలోకి వచ్చింది. మరి అవనిగడ్డలో వాల్తేరు వీరయ్య రన్ ఇంతటితో ముగుస్తుందా, ఇంకా కొనసాగుతుందా అన్నది చూడాలి.