సైంధవ్ చివరి 20 నిమిషాలే ప్రాణం

స్టార్ హీరోల సినిమాల్లో క్లైమాక్స్ ప్రభావం ప్రేక్షకుల మీద బలంగా ఉంటుంది. అందుకే దాన్ని డిజైన్ చేసుకునే విధానంలో రచయితలు దర్శకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. 13న విడుదల కాబోతున్న సైంధవ్ ట్రైలర్ చూశాక ఇదేదో కొంచెం చైల్డ్ సెంటిమెంట్ దట్టించిన యాక్షన్ ఎంటర్ టైనరని అధిక శాతం అనుకుంటున్నారు కానీ దర్శకుడు శైలేష్ కొలను మాత్రం అంతకు మించి ఊహించనివి ఎన్నో ఉంటాయని నొక్కి చెబుతున్నాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ రెగ్యులర్ బాషా టైపు ఫ్లాష్ బ్యాక్ చూడరని, ఒక కొత్త ప్యాట్రన్ ఎంచుకుని ఆశ్చర్యపరుస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.

మూడు రోజుల్లో రిలీజ్ ఉండగా శైలేష్ మరో కీలక అంశాన్ని నొక్కి చెబుతున్నాడు. సినిమాలోని చివరి 20 నిముషాలు ప్రతి ఒక్కరి జీవితంలో చూసిన అతి గొప్ప ఎక్స్ పీరియన్స్ లో ఒకటిగా ఫీలవుతారని, అంత అద్భుతంగా రావడానికి వెంకటేష్ తప్ప మరో కారణం లేదని చెప్పడం చూస్తే ఆ ఎపిసోడ్ ఓ రేంజ్ లో వచ్చినట్టు కనిపిస్తోంది. ఒక గొప్ప నటుడి నుంచి మర్చిపోలేని పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడం లైఫ్ లో ఏదో సాధించిన సంతృప్తినిస్తోందని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు. ఇదంతా చూశాక విక్టరీ అభిమానుల మనసులు ఊరికే ఉంటాయా. పీక్స్ లో ఉన్న అంచనాలను మరింత పైకి పెంచేస్తున్నారు.

ఎంత పోటీ ఉన్నప్పటికి సైంధవ్ సైలెంట్ కిల్లర్ లా బాక్సాఫీస్ ని ఆక్రమించుకుంటుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. గుంటూరు కారం ముందు రోజే వచ్చేస్తుంది కనక దాని టాక్ మొత్తం స్పష్టంగా తేలిపోతుంది. ఒకవేళ మహేష్ ఎంత పెద్ద హిట్టు కొట్టినా పెద్దోడిగా వెంకటేష్ కూడా అంతే స్థాయి విజయం నమోదు చేసుకుంటాడని ధీమాతో ఉన్నారు. శ్రద్ద శ్రీనాథ్, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్ధిక్, ఆర్య తదితరులు ప్రధాన పాత్ర పోషించిన ఈ మెడికల్ క్రైమ్ డ్రామాకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. నారప్ప తర్వాత అంత మాస్ గా వెంకటేష్ చేసిన సినిమా ఇదే.