పవన్ సినిమాని దానయ్య ఎందుకు వదులుతారు

పవన్ కళ్యాణ్ ఓజి సినిమా నిర్మాత డివివి దానయ్య చేతుల్లో నుంచి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్లపోయిందనే సోషల్ మీడియా వార్త ఒక్కసారిగా ట్విట్టర్ ని ఊపేసింది. ఒకపక్క గుంటూరు కారం ట్రైలర్ కోసం జనాలు ఎదురు చూస్తున్న టైంలో ఈ షాక్ ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఆర్ఆర్ఆర్ లాంటి నాలుగు వందల కోట్ల ప్యాన్ ఇండియా మూవీని చాలా కూల్ గా నిర్మించి, ఎంత లేట్ అయినా ఆ భారాన్ని చిరునవ్వుతో భరించిన దానయ్య బంగారం లాంటి పవర్ స్టార్ చిత్రాన్ని ఎందుకు వదిలేసుకుంటారనే అనుమానం ఎవరికైనా వస్తుంది. కానీ అలాంటిదేమీ లేదట.

ఓజి కన్ఫర్మ్ అయినప్పటి నుంచి దానయ్య మంచి జోష్ లో ఉన్నారు. జనసేన ప్లస్ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ షూటింగులకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఆయనేమి టెన్షన్ పడే రకం కాదు. పెట్టుబడుల మీద వడ్డీల భారం పడుతుంది కానీ అంతకంతా రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. నిర్మాణంలో బ్రేక్ వేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు కన్నా అభిమానుల ఆశలన్నీ ఓజి మీదే ఉన్నాయి. ముఖ్యంగా టీజర్ వచ్చాక ఇవి అమాంతం పెరిగిపోయాయి. అంతా సవ్యంగా ఉన్నప్పుడు దానయ్య లాంటి టాప్ ప్రొడ్యూసర్ ఇంకొకరికి బంగారు బాతుని ఇచ్చేస్తారా.

ప్రస్తుతానికి రెండు ప్రొడక్షన్ హౌసుల నుంచి ఎలాంటి అఫీషియల్ నోట్ రాలేదు. బ్రో టైంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో పవన్ కు మంచి అనుబంధం ఏర్పడిన మాట వాస్తవమే కానీ కేవలం ఆ కారణంగా ఓజిని వదులుకోమని దానయ్యకి ఎందుకు చెబుతారు. నాని సరిపోదా శనివారం షూటింగ్ లో బిజీగా ఉన్న దానయ్య బృందం ఈ ప్రచారం పట్ల ఎలా స్పందిస్తుందో చూడాలి. మాములుగా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫ్యాన్స్ కి తనదైన శైలిని సమాధానాలు ఇస్తూ ఉంటుంది. మరి ఇప్పుడెలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. దర్శకుడు సుజిత్ దాకా మ్యాటర్ వెళ్ళింది.