90s జ్ఞాపకాలను తట్టి చూపించారు

ఈ మధ్య ఓటిటి వెబ్ సిరీస్ లన్నీ క్రైమ్, సైకో కిల్లింగ్ మీదే ఎక్కువగా వస్తున్నాయి. ఒకదశలో జనాలకు బోర్ కొట్టేసి వీటి మీద గంటల తరబడి సమయాన్ని ఖర్చు చేయడం తగ్గించుకున్నారు. ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్ కి ప్రాధాన్యత ఇస్తూ ఇతర భాషల్లో ఏమో కానీ తెలుగులో తీసేవాళ్ళు కరువయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ మీద సగటు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఆరు ఎపిసోడ్లతో మొత్తం మూడున్నర గంటల ఆమోదయోగ్యమైన నిడివితో ఈటీవీ విన్ యాప్ లో నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మ్యాటరేంటో చూద్దాం.

పాత కొత్త తరాలకు మధ్య వారధిగా చెప్పుకునే 90 దశకం జ్ఞాపకాలను తవ్వి చూపించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ బయోపిక్ తీశారు. ఓ మధ్య తరగతి లెక్కల మాస్టారు(శివాజీ), ఒద్దికైన ఇల్లాలు(వాసుకి), ఈ జంటకు ఇద్దరబ్బాయిలు, ఓ అమ్మాయి ఇలా సింపుల్ ఫ్యామిలీ సెటప్ ని తీసుకున్నారు. టైటిల్ కార్డులో ముందే చెప్పినట్టు ఇందులో అనూహ్యమైన సంఘటనలు, మలుపులు ఉండవు. కేవలం అనుభూతులను పొందుపరిచారు. ఇంటికొచ్చిన బంధువులు వెళ్తూ డబ్బులిస్తారేమోనని పిల్లలు ఎదురు చూడటం, కేబుల్ కనెక్షన్ కష్టాలు, ఉప్మా మీద నిరసన, స్లామ్ బుక్ మెమోరీస్ ఇలా అన్నీ టచ్ చేశారు.

శివాజీ, వాసుకిలతో పాటు పిల్లలుగా నటించిన మౌళి, రోహన్ చెలరిగిపోయారు. కూతురిగా చేసిన వాసంతిక చక్కగా ఒదిగిపోయింది., మధ్యలో కొంత ల్యాగ్ అనిపించే సన్నివేశాలు ఉన్నప్పటికీ ఓవరాల్ కంటెంట్ విసుగు రాకుండా ఉండటంతో లోపాలు క్షమించేలానే సాగాయి. కొన్ని పొరపాట్లు తలెత్తాయి. తక్కువ లొకేషన్లలో, పరిమిత బడ్జెట్ తో కేవలం భావోద్వేగాలను నమ్ముకుని తీసిన 90 మిడిల్ క్లాస్ బయోపిక్ అందరికీ ఏమో కానీ జీతాల మీద ఆధారపడుతూ ఇప్పుడు రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న 90స్ ఉద్యోగుల కుటుంబాలకు మాత్రం భేష్షుగా కనెక్ట్ అవుతుంది. దర్శకుడు పాసైపోయాడు.