యాత్ర 2 మీద వ్యూహం ప్రభావం ఉంటుందా

స్వార్థపూరిత రాజకీయ ఉద్దేశాలతో రామ్ గోపాల్ వర్మ వ్యూహం తీశారని తెదేపా తరపున నారా లోకేష్ వేసిన పిటీషన్ వల్ల కోర్టు తీర్పుతో విడుదల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. చాలా స్పష్టంగా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసుకుని దారుణంగా వ్యక్తిత్వ హననం చేసేలా సినిమా ఉన్నట్టు ట్రైలర్లతోనే అందరికీ అర్థమైపోయింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పదనాన్ని మాత్రమే హైలైట్ చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ అపోజిషన్ లో ఉన్న నాయకులను చులకనగా చూపించడం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే.

ఇప్పుడు అందరి దృష్టి యాత్ర 2 మీదకు వెళ్తోంది. వర్మ అంత ఘాటుగా కాకపోయినా మహి వి రాఘవ్ సైతం జగన్ మీద కుట్రలో ఎందరో భాగమయ్యారని చూపించే ప్రయత్నం చేయడం ట్రైలర్ లో కనిపించింది. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడులకు చాలా దగ్గరగా పోలిన ఆర్టిస్టులను తీసుకోవడం, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ ని అంటూ ప్రధాన పాత్రధారి జీవాతో అనిపించడం వెనుక పొలిటికల్ మైలేజ్ తప్ప మరో కారణం ఉండదు. అయితే యాత్ర టైంలో రాని అభ్యంతరాలు ఇప్పుడు వస్తాయా అంటే సున్నితంగా మారిపోయిన పరిస్థితుల్లో రావొచ్చేమో.

ఫిబ్రవరి 8 విడుదల తేదీ ఇచ్చారు కానీ ఈగల్ కి సోలో డేట్ వచ్చేలా సహకరిస్తామని చెప్పిన ఫిలిం ఛాంబర్ మాట మేరకు యాత్ర మేకర్స్ వాయిదా ఏమైనా ఆలోచిస్తారేమో చూడాలి. టిల్లు స్క్వేర్ రేస్ నుంచి తప్పుకుంది. ఒకవేళ ఎలాంటి అబ్జెక్షన్లు రాకపోతే యాత్ర 2 చెప్పిన డేట్ కే రావొచ్చు. ఎందుకంటే అప్పటికి ఎన్నికలు చాలా దగ్గరగా ఉంటాయి కానీ సినిమా తాలూకు ప్రయోజనం దక్కాలంటే ఆ నెలలోనే రావాలి. పోటీ వల్ల వసూళ్లు ప్రభావితం చెందినా లేక తగ్గినా దాని గురించి నిర్మాతలు టెన్షన్ పడకపోవచ్చు. ఎందుకంటే ప్రచారాస్త్రంగా రూపొందుతున్న యాత్ర 2 టార్గెట్ కేవలం థియేటరే కాదు కాబట్టి.