పుష్ప 2 బిజినెస్ పెద్ద పీఠముడి

విడుదలకు ఇంకా ఏడు నెలలకు పైగా టైం ఉన్నపటికీ పుష్ప 2 బిజినెస్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటి నుంచే ప్లానింగ్ లో ఉన్నారు. థియేట్రికల్ ఆఫర్లు దానికి తగ్గట్టే వస్తుండటంతో తాము అనుకున్న ఫిగర్లు వస్తే అడ్వాన్స్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందల కోట్లు, ఓవర్సీస్ నుంచి కనీసం వంద కోట్ల దాకా అంచనాలు పెట్టుకుని దానికి తగ్గట్టే ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. అయితే బయ్యర్లు ఇంత భారీ మొత్తమంటే రిస్క్ అవుతుందనే ఉద్దేశంలో ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదని తెలుస్తోంది.

పుష్ప మేకర్స్ ఇంత ఆశించడానికి కారణం లేకపోలేదు. యానిమల్ ఏ సర్టిఫికెట్ ఉన్నా తొమ్మిది వందల కోట్లు దాటేసింది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కంటెంట్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఫైనల్ గా బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. అల్లు అర్జున్ ఇమేజ్ రన్బీర్ కపూర్, ప్రభాస్ లను మించి ఉంటుందని కాదు కానీ పుష్ప బ్రాండ్ మీద నార్త్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఒకవేళ ఏవైనా బాలీవుడ్ మూవీస్ క్లాష్ కు వస్తే పుష్పరాజ్ తొక్కేస్తాడనే రేంజ్ లో అక్కడి ఎగ్జిబిటర్లలోఅభిప్రాయం ఉంది. అందుకే ఉత్తరాదికి సంబంధించి ఇంకా ఎలాంటి చర్చలు మొదలుకాలేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే ట్రైలర్ చూశాక ఒక్కసారిగా హైప్ అమాంతం ఎక్కడికో వెళ్ళిపోతుందని ఇన్ సైడ్ టాక్. దర్శకుడు సుకుమార్ చాలా ఎలివేషన్లు పెట్టాడని, కొన్ని ఎపిసోడ్లు గూస్ బంప్స్ ని మించి ఉంటాయని ఊరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఫస్ట్ పార్ట్ ని మించి ఉంటాయనే ఫీడ్ బ్యాక్ తరచు వినిపిస్తోంది. అలాంటప్పుడు పుష్ప 2ని కామధేనువుగా చూడటంలో తప్పేమి లేదు. ఇంకా నలభై శాతం దాకా షూటింగ్ పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 15 విడుదలని మిస్ కాకుండా ఉండేందుకు సుక్కు అండ్ టీమ్ డే అండ్ నైట్ విపరీతంగా కష్టపడుతోంది.