ఆ నిర్మాత‌లు దొంగ‌ల‌న్న దేవా క‌ట్టా

ఆటోన‌గ‌ర్ సూర్య‌.. విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా కెరీర్‌ను అల్ల‌క‌ల్లోలం చేసిన సినిమా. మొదలు పెట్టిన మూడేళ్ల‌కు కానీ ఇది పూర్తి కాలేదు. షూటింగ్ మ‌ధ్య‌లో ఆగిపోయి, విడుద‌ల కోసం చాలా కాలం ఎదురు చూసిందీ చిత్రం. మేకింగ్ ద‌శ‌లో చాలా ఇబ్బందుల్ని అధిగ‌మించి అతి క‌ష్టం మీద ఈ సినిమాను బ‌య‌టికి తీసుకొచ్చాడు దేవా. చివ‌రికి ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్నందుకోలేదు. దీని వ‌ల్ల దేవా కెరీర్లో విలువైన కాలం వృథా అయింది. ఆ సినిమా త‌ర్వాత అత‌ను ఏ ద‌శ‌లోనూ కోలుకోలేదు. కెరీర్లో మ‌రింత గ్యాప్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత చేసిన డైన‌మైట్ కూడా ఆడ‌లేదు. హిందీలో చేసిన ప్ర‌స్థానం కూడా తేడా కొట్టింది. చివ‌రికిప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మొద‌లుపెట్టాడు. లాక్ డౌన్ త‌ర్వాత ఆ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఆరంభం కానుంది.

ఐతే త‌న కెరీర్ దెబ్బ తిన‌డానికి కార‌ణ‌మైన ఆటోన‌గ‌ర్ సూర్య సినిమా అలా త‌యార‌వ‌డానికి నిర్మాత‌లే కార‌ణ‌మ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో దేవా అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. నిర్మాత‌లు అని కానీ.. వారి పేర్లు కానీ చెప్ప‌కుండా ఆ సినిమా విష‌యంలో తాను కొంద‌రు దొంగ‌ల ముఠా కార‌ణంగా మోసానికి గుర‌య్యానని దేవా చెప్పాడు. వెన్నెల‌, ప్ర‌స్థానం సినిమాలు మాత్ర‌మే పూర్తిగా త‌న నియంత్ర‌ణ‌తో తెర‌కెక్కాయ‌ని.. త‌ర్వాత తాను చేసిన సినిమాలు త‌న చేతులు దాటి వెళ్లిపోయాయ‌ని దేవా అన్నాడు. ఆటోన‌గ‌ర్ సూర్య సినిమాను నిర్మించింది ఆర్ఆర్ మూవీ మేక‌ర్స్. ఒక ద‌శ‌లో మంచి ఊపుతో క‌నిపించిన ఈ సంస్థ‌.. ఉన్న‌ట్లుండి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆటోన‌గ‌ర్ సూర్య కంటే ముందు నాగార్జున న‌టించిన ఢ‌మ‌రుకం సైతం ఇలాగే ఇబ్బందుల్లో చిక్కుకుని ఆల‌స్యంగా విడుద‌లైంది. ఆటోన‌గ‌ర్ సూర్య త‌ర్వాత ఈ సంస్థ మూత‌ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే.