ప్రభాస్‌ను ఢీకొట్టేది ఎవరో చెప్పేస్తున్నారు

తన అభిమానులను ఉర్రూతలూగించే అప్ డేట్‌లు ఇచ్చాడు ప్రభాస్ గత కొన్ని నెలల్లో. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ఒక సినిమాను అనౌన్స్ చేసిన కొన్ని నెలలకే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ప్రకటించాడు. రెండు వారాల కిందటే దీని అప్ డేట్ వచ్చింది. దాని బడ్జెట్ రూ.500 కోట్లని.. రామాయణ కథను ప్రస్తుత కాలానికి అన్వయించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని.. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తారని.. ఇలా అనేక విశేషాలు బయటికి వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర చేయనుండగా.. అతణ్ని ఢీకొట్టే రావణుడెవరా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది. ఈ పాత్రకు సైఫ్ అలీఖాన్‌తో పాటు కొందరు బాలీవుడ్ స్టార్ల పేర్లు వినిపించాయి. ఐతే ఈ విషయంలో సస్పెన్స్‌కు గురువారం తెరదించేయబోతున్నారు.

‘ఆదిపురుష్’ విలన్ పాత్ర గురించి ఆసక్తికర ఇన్‌పుట్స్‌తో అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు ఓం రౌత్. 7 వేల ఏళ్ల కిందట ప్రపంచంలోనే అత్యంత తెలివైన దుష్టుడు ఉండేవాడని.. అతనెవరన్నది గురువారం ఉదయం 7.11 నిమిషాలకు ప్రకటిస్తామని చెప్పాడు ఓం రౌత్. ఇంతకుముందు ‘ఆది పురుష్’ అనౌన్స్‌మెంట్ సైతం ఉదయం 7.11 గంటలకే ఇవ్వడం విశేషం. దేవుడి కథతో ముడిపడ్డ సినిమా కావడంతో టైమింగ్ విషయంలో సెంటిమెంట్ నడుస్తున్నట్లుంది. మరి ఆజానుబాహుడైన ప్రభాస్ ముందు అతడికి దీటుగా నిలబడే విలన్ ఎవరో చూడాలి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్‌తో కలిసి ఓం రౌత్, ఇంకో ముగ్గురు ప్రొడ్యూసర్లు నిర్మించనున్నారు. అన్ని భారతీయ ప్రధాన భాషలతో పాటు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలుపెట్టి 2022లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్.