పండగ సినిమాలకు కరోనా టెన్షన్

అంతా అయిపోయింది ఇక మహమ్మారి రాదనుకుంటున్న టైంలో కరోనా కొత్త వెర్షన్ మెల్లగా పాకుతుండటం జనంలో ఆందోళన రేకెత్తిస్తోంది. గతంలో లాగా జబ్బు లక్షణాలు తీవ్రంగా కనిపించకపోయినా లోలోపల జ్వరం తరహాలో బాధితులుగా మారుతున్న వాళ్ళు వందల్లో ఉంటున్నారు. కేరళలో మొదలై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సింగల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. ఇది మునుపటి స్థాయిలో అందరి ప్రాణాల మీదకు తెచ్చేది కాదని డాక్టర్లు చెబుతున్నా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. వచ్చే వారం నుంచి మాస్కుల నిబంధన, పరీక్షలు కఠినం చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి.

ఇంకో ఇరవై రోజుల్లో మొదలు కాబోతున్న సంక్రాంతి సినిమాలకు ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే వీటి మీద వందల కోట్ల పెట్టుబడులు పారుతున్నాయి. బయ్యర్లు అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఎగ్జిబిటర్లుతో ఒప్పందాలు జరిగిపోయాయి. గుంటూరు కారం, సైంధ‌వ్‌, ఈగల్, నా సామిరంగ, హనుమాన్ ఎవరికి వారు తగ్గమంటూ పదే పదే రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. ప్రమోషన్లు కూడా వేగమందుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా భయం ప్రేక్షకుల్లో వస్తే మాత్రం థియేటర్  ఆక్యుపెన్సీలు రిస్క్ లో పడతాయి.

ఆల్రెడీ రెండు సార్లు కరోనా దెబ్బ ఇండస్ట్రీ మీద బలంగా పడింది. దాన్నుంచి కోలుకోవడానికి నెలలు సరిపోలేదు. ఎందరో నిర్మాతలు కోట్లలో నష్టపోయారు. మళ్ళీ రిపీట్ అయితే తట్టుకోవడం కష్టం. పైగా వాయిదాల వల్ల వడ్డీల భారం పెరిగిపోతుంది. ప్రస్తుతనికి ప్రమాద ఘంటికలు తక్కువగానే వినిపిస్తున్నాయి కానీ కీడెంచి మేలెంచమన్న పెద్దల మాటలు గుర్తుపెట్టుకుని ప్రిపేర్ కావడం అవసరం. ఏదీ జరగకూడదని కోరుకోవడమే అందరూ చేయాల్సింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ముందస్తు చర్యలైతే మొదలుపెట్టాయి కానీ కట్టడి విషయంలో జనాలు ఆరోగ్య క్రమశిక్షణతో ఉంటే ఉంటే ఏ సమస్యా రాదు.