గుంటూరు కారం ముందున్న తక్షణ కర్తవ్యం

ఓ మే బేబీ పాట వల్ల ఏ మాత్రం ఊహించని డ్యామేజ్ గుంటూరు కారంకి జరిగిపోయింది. స్టార్ హీరోల పాటలు అంచనాలు అందుకోలేకపోవడం ఇదేమి మొదటిసారి కాదు. అయినా తమన్ ని టార్గెట్ చేసిన అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు. ఉండబట్టలేక గీత రచయిత రామజోగయ్య శాస్త్రి నిన్న ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని హెచ్చరిక చేయడం వేడిని ఇంకాస్త పెంచింది. ఫీడ్ బ్యాక్ ఎలా ఉన్నా విని వీలైతే పాటించాలి లేదా వదిలేయాలి తప్ప పర్సనల్ ఫీలింగ్స్ ని ట్విట్టర్ లో పెడితే స్వంత మనోభావాలు దెబ్బ తినే దాకా పరిస్థితి వెళ్తుంది.

ఇప్పుడు గుంటూరు కారం టీమ్ తక్షణ కర్తవ్యాలు రెండున్నాయి. వీలైనంత ఫ్యాన్స్ అసంతృప్తిని తగ్గించే దిశగా త్వరగా ఒక మాస్ సాంగ్ రిలీజ్ చేయడం. అది షూట్ చేసినా చేయకపోయినా కేవలం మహేష్ ఫోటోలతో వదిలినా చాలు అభిమానులు ఖుష్ అయిపోతారు. మరొకటి ట్రైలర్ కట్ ఎడిటింగ్, రీ రికార్డింగ్ ఈ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం. ఇవి కరెక్ట్ గా బ్యాలన్స్ అయితే ఓ మై బేబీ తాలూకు గాయాన్ని త్వరగా మర్చిపోతారు. అంచనాలు విపరీతంగా ఉన్నప్పుడు వాటిని అందుకునే క్రమంతో ఎవరికైనా తడబాటు జరగొచ్చు. అంతమాత్రాన ఏదో మునిగిపోయినట్టు కాదు.

జరుగుతున్న రచ్చ మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ దృష్టికి వెళ్లిపోయింది. నమ్రత ద్వారా మహేష్ బాబుకి చేరిపోయింది. దీన్ని ఇప్పటికిప్పుడు రిపేర్ చేసే అవకాశం లేకపోయినా మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం ఈజీనే. వీళ్ళు అదే చేయబోతున్నారు. పోకిరి రేంజ్ లో బ్లాక్ బస్టర్ పడాలని గుంటూరు కారం మీద ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ అందుకే ప్రతి అప్డేట్ కి విపరీతంగా ఊగిపోతున్నారు. మాములుగా టైంలో అయితే ఓ మై బేబీ మీద ఇంత నెగటివిటీ వచ్చేది కాదేమో. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇవన్నీ ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. త్రివిక్రమ్ తనదైన శైలిలో ఎలా సమాధానమిస్తారో చూడాలి.